Kamal Haasan Tweet: తమిళనాడు రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠ కలిగిస్తున్నాయి. 234 సీట్లకు గాను 108 సీట్లు సాధించిన అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటులో చిక్కులు ఎదురవుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118 కోసం ఆ పార్టీ అధినేత విజయ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ మద్దతు ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోవడంతో సంఖ్యాబలం ఉంటనే ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వెల్లడించారు. ఈ క్రమంలో గవర్నర్ తీరుపై అగ్ర నటుడు, ఎంపీ కమల్ హాసన్ అసహన వ్యక్తం చేస్తున్నారు.
108 సీట్లు గెలుచుకున్న విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ను ఆహ్వానించకపోవడం ప్రజల తీర్పును అగౌరవపరచడమేనని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజా తీర్పును స్వాగతించి ప్రతిపక్షంలోనే ఉంటామన్న స్టాలిన్ రాజకీయ పరిణతిని గౌరవిస్తాన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇలాగే వ్యవహరించాలని సూచించారు. మెజారిటీ లోక్ భవన్లో కాకుండా శాసనసభలో నిరూపించుకోవాలని కర్ణాటక మాజీ సీఎం బొమ్మై కేసులో సుప్రీంకోర్టు తెలిపిందని ఈ సందర్భంగా కమల్ హాసన్ గుర్తు చేశారు.
ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించాలి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలను గవర్నర్ అవమానిస్తున్నారు. లోక్ భవన్ కాదు.. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలి. తమిళనాడు చర్రితలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు.- ఎంపీ కమల్ హాసన్
మరోవైపు సంఖ్యాబలం, మద్దతు లేఖపై గవర్నర్ మరోసారి న్యాయ సలహా తీసుకుంటున్నారు. లీగల్ అడ్వైజ్ తర్వాత నిర్ణయం ప్రకటించనున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నామని గవర్నర్కు లేఖ ఇచ్చిన విజయ్.. కాంగ్రెస్ మద్దతు లేఖను సమర్పించారు. ఇంకా 20 మంది మంత్రుల జాబితాను కూడా అందజేశారు. ఈ క్రమంలో కోర్ కమిటీతో సమావేశమైన టీవీకే నేతలు.. గవర్నర్ అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.

