My Home Rameshwar Rao on Forbes list: ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితా విడుదల చేసింది. 2026 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం తన సత్తా చాటింది. ఈ జాబితాలో మొత్తం 13 మంది భారత రియల్టీ దిగ్గజాలకు చోటు దక్కగా.. వీరిలో తెలుగు పారిశ్రామికవేత్త, మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు కూడా ఉండటం విశేషం.
Also read: Minister Jupally: పర్యాటక రంగ అభివృద్ధే మా తొలి ప్రాధాన్యత.. మంత్రి జూపల్లి స్పష్టం
1,90 లక్షల కోట్లతో రామేశ్వర్ రావు..
ఫోర్భ్స్ తాజా జాబితా ప్రకారం, డీఎల్ఎఫ్ ఛైర్మన్ ఎమిరిటస్ కుశాల్ పాల్ సింగ్ సుమారు రూ. 10.54 లక్షల కోట్ల (12.7 బిలియన్ డాలర్ల) సంపదతో భారత రియల్ ఎస్టేట్ బిలియనీర్లలో టాప్ ప్లేస్లో నిలిచారు. ఆయన తర్వాత స్థానంలో మంగల్ ప్రభాత్ లోధా (రూ. 5.06 లక్షల కోట్లు), చంద్రు రహేజా (రూ. 4.39 లక్షల కోట్లు), వికాస్ ఓబెరాయ్ (రూ. 3.90 లక్షల కోట్లు), అతుల్ రూయా (2.15 లక్షల కోట్ల రూపాయలు), మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు (1.90 లక్షల కోట్ల రూపాయలు) నిలిచారు. వీరి తర్వాతి స్థానాల్లో జితేంద్ర విర్వాని, కబీర్ ముల్చందాని, మోఫత్రాజ్ మునోట్, ప్రెస్టీజ్ గ్రూప్కు చెందిన రజాక్ సోదరులు (ఇర్ఫాన్, రెజ్వాన్, నోమన్) లిస్టులో స్థానం దక్కించుకున్నారు.
లగ్జరీ ఇళ్లకు పెరిగిన డిమాండ్..
గ్రాంట్ థార్న్టన్ నివేదిక ప్రకారం, 2026 మొదటి త్రైమాసికంలో దేశంలో రియల్ ఎస్టేట్ డీల్స్ సంఖ్య 28 నుంచి 32కి పెరిగింది. అయినప్పటికీ, వాటి మొత్తం విలువ గతేడాది 3 బిలియన్ డాలర్ల నుంచి 763 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే, నికర విలువ పడిపోయినా.. రియల్ ఎస్టేట్ వృద్ధి కారణంగా కొనుగోళ్లు పెరిగి ఈ బిలియనీర్ల సంపద వృద్ధి చెందినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఈ బిలియనీర్లంతా 2021లో తక్కువ ధరలకే ఆస్తులు కొనడం, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం, ప్రస్తుతం లగ్జరీ గృహాలకు డిమాండ్ పెరగడం కలిసొచ్చింది. ఇప్పటికీ దేశంలో 64 శాతం మంది సంపన్నులు రియల్ ఎస్టేట్నే తమ తొలి పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలోనే భారీగా లాభాలు పొందవచ్చని బలంగా నమ్ముతున్నారు.

