National Herald Mystery Unfolds: నేషనల్ హెరాల్డ్… ఒకప్పుడు జాతీయ ఉద్యమానికి స్వరం, ఆ తర్వాత మౌనం దాల్చిన పత్రిక, ఇప్పుడు మళ్ళీ దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అదీ మామూలు సంచలనం కాదు, ఏకంగా రూ.50 లక్షల పెట్టుబడితో రూ.2000 కోట్ల ఆస్తులను చేజిక్కించుకున్నారన్న ఆరోపణలు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై చేసిన ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో… అసలు ఈ ‘నేషనల్ హెరాల్డ్’ వెనుక దాగి ఉన్న కథేంటి? రూ.2000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి..? ఈడీ ఆరోపణల్లో నిజమెంత..? రౌస్ అవెన్యూ కోర్టులో సాగుతున్న విచారణ ఏ మలుపు తిరుగుతుంది..?
ఆస్తులను అపహరించడానికే జరిగిన కుట్ర : జూలై 3, 2025న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే సమక్షంలో జరిగిన కీలక విచారణలో, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదనలు వినిపించారు. ‘
‘యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్’ (YIL) ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కేవలం రూ.50 లక్షలు వెచ్చించి, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) కు చెందిన సుమారు రూ.2000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా సంపాదించారని ఈడీ ఆరోపించింది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీలుమాత్రమే కాదని, ఆస్తులను అపహరించడానికే జరిగిన కుట్రగా ఈడీ నొక్కి చెప్పింది.
నేషనల్ హెరాల్డ్ కథ ఏంటి : భారత తొలి ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ స్థాపించిన ప్రతిష్టాత్మక పత్రిక నేషనల్ హెరాల్డ్. 2008లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇది మూతపడింది. అయితే, 2012లో నాటి బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ఈ కేసును తెరపైకి తెచ్చారు. సోనియా, రాహుల్ గాంధీలు YIL ద్వారా AJL నిధులను తమకు అనుకూలంగా మళ్లించారని, ఇది మోసం, నమ్మక ద్రోహం అని ఆరోపించారు.
అప్పటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. ఈడీ 2021 నుండి ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తోంది. ఏప్రిల్ 2025లో, ఈడీ సోనియా, రాహుల్ గాంధీ, సామ్ పిట్రోడా సహా ఏడుగురిపై నేరపూరిత ఫిర్యాదు దాఖలు చేసింది.
నిధుల రద్దు: నకిలీ లావాదేవీల చిక్కుముడి : ఈడీ వాదనల ప్రకారం, YIL ద్వారా AJL ను స్వాధీనం చేసుకున్న తర్వాత, గాంధీలకు అత్యంత సన్నిహితులను AJL బోర్డులో డైరెక్టర్లుగా నియమించారు. ఈడీ తరఫున వాదించిన రాజు, కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ అగ్ర నాయకుల ఆదేశాల మేరకు నకిలీ అద్దె రసీదులు, ముందస్తు చెల్లింపుల రూపంలో నిధులను AJL కు మళ్లించారని పేర్కొన్నారు.
ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం, “అద్దె, ప్రకటనల చెల్లింపుల రూపంలో నిధులు సరఫరా చేశారు. అయినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు లేనందున ఈ లావాదేవీలు నకిలీగా ఉన్నాయి.” అంటే, ఎలాంటి నిజమైన సేవలు లేదా లావాదేవీలు లేకుండానే డబ్బును తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది.
కోర్టు విచారణ: నేర అవగాహన కోసం వాదనలు: ప్రస్తుతం రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ ఫిర్యాదుపై ‘నేర అవగాహన’ (Cognizance) తీసుకోవాలా వద్దా అనే అంశంపై వాదనలు వింటోంది. అంటే, ఈడీ సమర్పించిన ఆధారాలను పరిశీలించి, కేసులో ప్రాథమికంగా నేరం జరిగినట్లు కోర్టు నిర్ధారిస్తేనే విచారణ ముందుకు సాగుతుంది.
ఈ విచారణలో, గాంధీలు రూ.2000 కోట్ల ఆస్తులను “సైఫన్ అవుట్” (పక్కదారి పట్టించే) చేసే ఉద్దేశ్యంతో కుట్ర పన్నారని ఈడీ బలంగా వాదిస్తోంది. న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ కేసును అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రోజువారీ ప్రాతిపదికన విచారణ జరుపుతున్నారు. ఈ కేసు విచారణ భారత రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో, నిజం ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి.