NEET UG Paper Leak NTA: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం నేపథ్యంలో.. పరీక్షల నిర్వహణ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) లో కేంద్రం ప్రక్షాళనకు దిగింది. పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు పరిపాలనాపరమైన మార్పులు చేపట్టింది. శనివారం కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఎన్టీఏ (NTA)లో నలుగురు నూతన ఉన్నతాధికారులను నియమించింది. ఇందులో ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు ఉన్నారు.
Also Read: https://teluguprabha.net/business/ban-on-silver-imports/
2013 బ్యాచ్కి చెందిన IRS అధికారి ఆకాశ్ జైన్, అదే బ్యాచ్కి చెందిన ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారి ఆదిత్య రాజేంద్ర భోజ్గఢియాను నూతన జాయింట్ డైరెక్టర్లుగా నియమించింది. 1998 బ్యాచ్కు చెందిన ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అధికారిణి అనూజ బాపట్, 2004 బ్యాచ్కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి రుచితా విజ్ను నూతన జాయింట్ సెక్రటరీలుగా కేంద్రం నియమించింది. వీరిద్దరూ ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/bandi-bhagirath-surrenders-before-police-in-pocso-case/
మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షా పత్రం లీక్ కావడంతో పరీక్షను రద్దు చేసి, దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఎన్టీఏ అంతర్గత లూప్హోల్స్, కమాండ్ చైన్ వైఫల్యాల వల్లే లీక్ జరిగిందని తెలుస్తోంది. కాగా, రద్దయిన నీట్ పరీక్షను తిరిగి జూన్ 21 నిర్వహించనున్నారు. ఈ క్రమంలో లీక్లను అరికట్టడానికి 2027 విద్యాసంవత్సరం నుంచి నీట్ యూజీ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత (ఆన్లైన్) పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో సీబీఐ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసింది.

