ఓవైపు భారత్-పాక్ మధ్య యుద్దం కొనసాగుతుంటే.. మరోవైపు నకిలీ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా ఏటీఎంలు(ATMS Closed) మూసివేస్తున్నారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ర్యాన్సమ్వేర్ సైబర్ దాడి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రెండు నుంచి మూడు రోజులు ఏటీఎంలు మూసివేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) స్పందించింది. ఇది ఫేక్ వార్త అని స్పష్టం చేసింది. ఏటీఎంలు ఎప్పటిలాగే పనిచేస్తాయని ఇలాంటి అసత్య వార్తలను నమ్మొద్దని సూచించింది
ఇదిలా ఉంటే గుజరాత్లోని పోర్టు సహా, జలంధర్లో డ్రోన్, క్షిపణి దాడుల దృశ్యాలంటూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను భారత్ తిప్పికొట్టింది. గుజరాత్లోని హజీరా పోర్ట్పై దాడి జరిగిందంటున్న వీడియో 2021 నాటి ఓ ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించినదని పీబీఐ ఫ్యాక్ట్చెక్ స్పష్టం చేసింది. ఇక జలంధర్లో డ్రోన్ దాడి వీడియోలు గతంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించినవి పేర్కొంది.
