Nashik TCS Case: మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో సంచలనం సృష్టించిన మతమార్పిడి, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత 42 రోజులుగా పరారీలో ఉన్న ఆమెను ఈ రోజు ఛత్రపతి శంభాజీనగర్లో నాసిక్ ప్రత్యేక దర్యాప్తు బృందం, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో అదుపులోకి తీసుకున్నారు.
నాసిక్ టీసీఎస్ బ్రాంచ్లో పనిచేస్తున్న ఒక మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ఇస్లాం మతంలోకి మారాలని బలవంతం చేయడం, మానసిక, లైంగిక వేధింపులకు గురిచేయడం వంటి ఆరోపణలతో నిదా ఖాన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని బ్రెయిన్ వాష్ చేయడం, బుర్కా ధరించాలని ఒత్తిడి చేయడం, నమాజ్ నేర్పడం, మతపరమైన యాప్లను ఫోన్లో ఇన్స్టాల్ చేయించడం వంటివి చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ మతమార్పిడి కుట్రలో మలేషియాతో సహా అంతర్జాతీయ లింకులు ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలి పేరును ‘హానియా’గా మార్చి మలేషియాకు తరలించే ప్లాన్ కూడా ఉన్నట్లు సమాచారం.
Also Read: https://teluguprabha.net/telangana/wages-increased-for-telangana-beedi-workers/
కాగా, నిదా ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను నాసిక్ సెషన్స్ కోర్టు మే 2న తిరస్కరించింది. ఆ తర్వాతే ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిదా ఖాన్తో పాటు మరికొందరు నిందితులపై మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇప్పటికే డానిష్ షేక్ అనే మరో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ను కూడా ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలపై స్పందించిన టీసీఎస్ యాజమాన్యం.. ఇలాంటి వేధింపుల పట్ల తమకు జీరో టోలరెన్స్ పాలసీ ఉందని వెల్లడించింది. బాధ్యులైన వారిని సస్పెండ్ చేసినట్లు తెలిపింది.

