Vijay Mallya, Nirav Modi: విజయ్ మాల్యా, నీరవ్ మోడీ.. గుర్తున్నారు కదా..బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణం ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయి బ్రిటన్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లు వీళ్లు. చాలా కాలం నుంచి వీరిని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో యూకే అధికారులు ఢిల్లీలోని తీహార్ జైలు ను సందర్శించడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ బృందం ఈ ఏడాది జులైలో తీహార్ జైలును సందర్శించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జైల్లో భద్రత, ఖైదీలకు అందించే సౌకర్యాలను పరిశీలించారని తెలిసింది. దీంతో ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్కు అప్పగించే అవకాశం ఉన్నట్లు..అందులో భాంగానే బ్రిటన్ టీం జైలును సందర్శించారని ప్రచారం జరుగుతోంది.
కాగా భారత్లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేసి విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయాడు. 2016 నుంచి లండన్లో తలదాచుకుంటున్నాడు. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్కు నీరవ్ మోడీ దాదాపు రూ.14 వేల కోట్ల రుణం ఎగవేసి అతను అదే దేశంలో ఆశ్రయం పొందుతున్నాడు. నీరవ్ మోడీ ఉదంతం 2018లో వెలుగులోకి వచ్చింది. వీరి ఈ కేసులను సీబీఐ, ఈడీ విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా నీరవ్ ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. ఈ ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి రప్పించేందుకు భారత అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో నీరవ్ మోడీ తమదేశంలోనే నివసిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం 2018 డిసెంబర్లో ప్రకటించిన తర్వాత అతని ‘ఆచూకీ’ తెలిసంది. అతడిని తమకు అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. దీంతో 2019లో నీరవ్ మోడీని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని భారత్కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిణామాలతో నీరవ్ అక్కడి ఆశ్రయించగా దాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. వీరితోపాటు పన్ను ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్ను మధ్యవర్తి సంజయ్ భండారీని కూడా రప్పించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. గతేడాది బ్రెజిల్ పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అక్కడ బ్రిటన్ ప్రధానితో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా , నీరవ్ మోడీలను భారత్కు అప్పగించాలని ఆయన్ను కోరారు. దీనికి బ్రిటన్ ప్రధాని సానుకూలంగా స్పందించారు.
పలుమార్లు ఎన్నికల ప్రచారంలోనూ విదేశాల్లో దాక్కున్న ఆర్థిక నేరగాళ్లను ఇండియాకు రప్పించి శిక్షిస్తామని ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.


