Saturday, November 15, 2025
Homeనేషనల్Bihar Elections 2025: మహిళలకు 35% స్థానిక రిజర్వేషన్...నితీశ్ సర్కార్ కీలక నిర్ణయం!

Bihar Elections 2025: మహిళలకు 35% స్థానిక రిజర్వేషన్…నితీశ్ సర్కార్ కీలక నిర్ణయం!

Nitish Govt Introduces Domicile Reservation For Women: 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో, నితీశ్ కుమార్ సర్కార్ మహిళలు, యువతపై దృష్టి సారించి కీలక నిర్ణయాలు వెల్లడించింది. ముఖ్యంగా, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం స్థానిక రిజర్వేషన్ కోటాను వర్తింపజేస్తూ సంచలన ప్రకటన చేసింది. ‘డొమిసైల్ రిజర్వేషన్’గా పిలవబడుతున్న ఈ విధానం అంటే ఏమిటి? ఇది ఎవరికి వర్తిస్తుంది? ఈ నిర్ణయం వెనుక నితీశ్ సర్కార్ వ్యూహం ఏమిటి? అసలు ఈ డొమిసైల్ రిజర్వేషన్ ఎందుకు అవసరం? 

- Advertisement -

డొమిసైల్ రిజర్వేషన్ అంటే ఏమిటి : ‘డొమిసైల్ రిజర్వేషన్’ అనగా ‘స్థానిక రిజర్వేషన్ కోటా’. అంటే, కేవలం ఆ రాష్ట్రంలో జన్మించి, స్థానికంగా నివసిస్తున్న వారికి మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల మహిళలు కూడా బిహార్‌లో మహిళా రిజర్వేషన్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. బీహార్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇకపై బీహార్‌లో జన్మించిన మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘లోకల్’ (డొమిసైల్) సర్టిఫికెట్ పొందిన మహిళలు మాత్రమే 35% మహిళా రిజర్వేషన్లకు అర్హులు. ఈ నిబంధన గతంలో ఉన్న విధానానికి భిన్నంగా ఉంది, దీని ద్వారా స్థానిక మహిళలకు మాత్రమే రిజర్వేషన్ ప్రయోజనాలు దక్కుతాయి.

ఎందుకు ఈ నిర్ణయం : నితీశ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం, ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో ‘లోకల్ కోటా’ వర్తింపజేయలేదనే విమర్శలు ఎదుర్కోవడం. ఈ నేపథ్యంలో, స్థానిక మహిళలకు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలనే సంకేతాన్ని పంపేందుకు ఈ నిర్ణయం ఉపకరించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది రాష్ట్ర మహిళల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే ఆశలను చిగురింపజేస్తుంది. అలాగే, ఇతర రాష్ట్రాల మహిళా అభ్యర్థుల నుంచి బిహార్ రాష్ట్ర మహిళా అభ్యర్థులకు పోటీని తగ్గించి, స్థానిక మహిళలకు 35 శాతం కోటాలో ఉద్యోగాల కోసం పోటీపడే అవకాశాన్ని కల్పిస్తుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, మహిళలు, తొలిసారి ఓట్లు వేయబోయే యువతను ఎన్‌డీఏ కూటమి వైపు ఆకర్షించే ప్రయత్నంగా కూడా దీన్ని చూడవచ్చు.

డొమిసైల్ రిజర్వేషన్‌కు ఎవరు అర్హులు : బిహార్‌లోనే జన్మించిన మహిళలు  కనీసం గత మూడేళ్లుగా రాష్ట్రంలో నివసిస్తున్న వారు. రాష్ట్రంలో సొంత ఇల్లు లేదా భూమి కలిగినవారు.రాష్ట్రానికి చెందిన వారిని వివాహం చేసుకున్నవారు. పైన పేర్కొన్న అర్హతలను ధ్రువీకరించేలా జిల్లా అధికార యంత్రాంగం నుంచి ‘డొమిసైల్ సర్టిఫికెట్’ పొందిన వారే ఈ రిజర్వేషన్‌ను పొందగలరు. డొమిసైల్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసేటప్పుడు పుట్టిన తేదీ ధ్రువపత్రం లేదా ఓటరు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డులను సమర్పించాలి.

ఎవరు అనర్హులు : బిహార్‌లో నివసిస్తున్న, ఉద్యోగాలు చేస్తున్న ఇతర రాష్ట్రాల మహిళలు ఈ రిజర్వేషన్‌కు అనర్హులు. డొమిసైల్ సర్టిఫికెట్ లేని వలస కూలీలు, తాత్కాలిక నివాసితులకు ఈ రిజర్వేషన్ కోటా వర్తించదు.

దేశంలో ఇతర రాష్ట్రాల పరిస్థితి: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇదే తరహా డొమిసైల్ రిజర్వేషన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు, కాలేజీ సీట్ల భర్తీలో మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.

మంత్రులు, అధికారులు ఏమంటున్నారు : లాసీ సింగ్, బిహార్ రాష్ట్ర మంత్రి (ఆహార, వినియోగదారుల భద్రత): “ఇది చారిత్రక నిర్ణయం. బిహారీ మహిళల సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచీ నితీశ్ కుమార్ సర్కార్ మహిళల పక్షాన నిలుస్తోంది. వారి అభ్యున్నతి కోసం పాటుపడుతోంది.”

ఏఎస్ సిద్ధార్థ్, బిహార్ ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రెటరీ (కేబినెట్): “ఇకపై బిహారీ మహిళలకే 35 శాతం మహిళా రిజర్వేషన్లు లభిస్తాయి. ఇతర రాష్ట్రాల మహిళలను జనరల్ కేటగిరీ కింద పరిగణిస్తాం. యువత కోసం మేం బిహార్ యూత్ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. ఇది రాష్ట్రంలోని యువత సంక్షేమం కోసం అవసరమైన ప్రత్యేక పథకాలను రూపొందిస్తుంది. 

ఇతర కీలక నిర్ణయాలు: మహిళా రిజర్వేషన్‌తో పాటు, నితీశ్ సర్కార్ యువత, దివ్యాంగుల సంక్షేమం కోసం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది.

బిహార్ యూత్ కమిషన్ ఏర్పాటు: 18 నుంచి 45 ఏళ్లలోపు యువత విద్య, ఉపాధి, సంక్షేమంపై అధ్యయనం చేసి, ప్రణాళికలు రూపొందించేందుకు ఈ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం లభించింది.

దివ్యాంగ సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక చేయూత: ‘సంబల్’ పథకం కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల దివ్యాంగ సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు. యూపీఎస్‌సీ లేదా బీపీఎస్‌సీ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైతే రూ.50,000, మెయిన్స్‌లో ఉత్తీర్ణులైతే రూ.1 లక్ష అందిస్తారు. ఈ నిర్ణయాలన్నీ రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. నితీశ్ సర్కార్ తీసుకున్న ఈ చర్యలు బిహార్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు కారణమవుతాయో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad