Saturday, November 15, 2025
Homeనేషనల్Heavy rains : ఉత్తరాదిని వణికిస్తున్న వానలు...ప్రమాద స్థాయిని దాటిన యమున గంగానదులు!

Heavy rains : ఉత్తరాదిని వణికిస్తున్న వానలు…ప్రమాద స్థాయిని దాటిన యమున గంగానదులు!

Heavy rains in North India : ఉత్తరాది రాష్ట్రాలపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో దేశ రాజధాని దిల్లీ మొదలుకొని వాణిజ్య రాజధాని ముంబయి వరకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నదులు ఉప్పొంగి ప్రమాద ఘంటికలు మోగిస్తుండగా, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దిల్లీలో యమున ఉగ్రరూపం దాల్చడానికి కారణమేంటి…? ముంబయి మహానగరాన్ని ముంచెత్తుతున్న వానల తీవ్రత ఎంత? ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఫలిస్తున్నాయా..? ఈ జల ప్రళయం నుంచి ప్రజలకు ఎప్పుడు ఉపశమనం లభిస్తుంది..?

- Advertisement -

ఉత్తర భారతంలో రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చాయి. సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు దిల్లీ, మహారాష్ట్ర, హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఆకస్మిక వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా, రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం, ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి, సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

దిల్లీలో డేంజర్ మార్క్ దాటిన యమున : దేశ రాజధాని దిల్లీని యమునా నది భయపెడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు, హరియాణాలోని హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి 1.78 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో యమున ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు పాత రైల్వే వంతెన వద్ద నది నీటిమట్టం 205.79 మీటర్లకు చేరింది, ఇది ప్రమాదకర స్థాయి అయిన 205.33 మీటర్ల కన్నా ఎక్కువ. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక నీటిమట్టమని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు, దిల్లీలో ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

ముంబయిని ముంచెత్తిన మహా వర్షాలు : మహారాష్ట్ర రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 24 గంటల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 250 మి.మీ. పైగా వర్షపాతం నమోదైంది. విఖ్రోలిలో అత్యధికంగా 255.5 మి.మీ., బైకుల్లాలో 241 మి.మీ. వర్షపాతం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. ఐఎండీ ‘రెడ్ అలర్ట్’ జారీ చేయడంతో బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. అత్యవసర సేవలు మినహా ఇతర కార్యాలయాలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానాన్ని పాటించాలని సూచించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పరిస్థితిని సమీక్షించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సహాయక బృందాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు.

హరియాణా, పంజాబ్‌కు హెచ్చరికలు : హరియాణాలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఆగస్టు 23 తర్వాత దక్షిణ హరియాణాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ శాస్త్రవేత్త సురీందర్ పాల్ సూచించారు. పంజాబ్‌లోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కొనసాగుతాయని తెలిపారు.

ఉప్పొంగిన గంగ.. హిమాచల్‌లో కొండచరియలు : ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలకు హరిద్వార్ వద్ద గంగానది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నదీ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా కులు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు  సెలవు ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad