Emergency Alert Test to Mobiles: దేశవ్యాప్తంగా శనివారం మొబైల్ వినియోగదారుల ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం(బీప్ సౌండ్) వచ్చే అవకాశం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే “ఎమర్జెన్సీ అలర్ట్ టెస్ట్”. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(NDMA) సంయుక్తంగా ఈ సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను పరీక్షిస్తున్నాయి.
భూకంపాలు, వరదలు లేదా తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను తక్షణమే అప్రమత్తం చేయడానికి ఇది ఒక ‘టెస్ట్ అలర్ట్’గా కేంద్రం పేర్కొంది. ఈ పరీక్ష శనివారం ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల మధ్య జరిగే అవకాశం ఉంది. మీ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉన్నప్పటికీ, అది పెద్దగా వైబ్రేట్ అవుతూ సైరన్ శబ్దం చేస్తుంది. దానితో పాటు స్క్రీన్పై ఒక ఫ్లాష్ మెసేజ్ కూడా కనిపిస్తుంది. ఇది కేవలం టెస్ట్ మాత్రమే కాబట్టి మొబైల్ వినియోగదారులు కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. సందేశాన్ని చదివి వదిలేస్తే సరిపోతుందని తెలిపింది.

