PURI RATHA YATRA 2025 MEETING : ఆధ్యాత్మిక లోకంలో అత్యంత పవిత్రంగా, వైభవంగా జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్రకు మరికొద్ది రోజుల్లో అంగరంగ వైభవంగా తెరలేవనుంది. జగన్నాథుని దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు దేశవిదేశాల నుంచి తరలిరావడం సంప్రదాయం. అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, భక్తుల ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. జగన్నాథుని కృపతో ఎలాంటి ఆపదలు రాకుండా, యాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
భక్తులకు కీలక సూచనలు…
ఒడిశా రాష్ట్ర మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపిన వివరాల ప్రకారం, కేంద్రం ఆదేశాలు లేకున్నా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలున్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రథయాత్రకు దూరంగా ఉండాలని సూచించారు. ఇది ఆంక్ష కాదని, భక్తులపై ప్రభుత్వానికి ఉన్న బాధ్యతేనని మంత్రి స్పష్టం చేశారు. భక్తులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని, తరచుగా చేతులు శుభ్రపరచుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 49 కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య కార్యదర్శి అశ్వతీ తెలిపారు. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని కూడా సూచించారు.
యాత్ర సజావుగా సాగేందుకు సమగ్ర ప్రణాళిక..
హరిచందన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొవిడ్ నియంత్రణతో పాటు, రథయాత్రకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. రథ నిర్మాణం, కలప సరఫరా, రథం లాగడం, భక్తులకు ఆరోగ్య సేవలు, తాగునీటి సరఫరా, విద్యుత్, మురుగునీరు, రోడ్డు-రైల్వే రవాణా, శాంతిభద్రతల నిర్వహణ, నిత్యావసర వస్తువుల సరఫరా, సాంస్కృతిక కార్యక్రమాల వంటి అన్ని విషయాలపై సమగ్ర ప్రణాళికలు రూపోందిస్తున్నారు.