Sunday, November 16, 2025
Homeనేషనల్Operation Sindoor: 'సిందూర్' వ్యూహంతో... శత్రువుకు చెక్ పెట్టిన సైన్యం!

Operation Sindoor: ‘సిందూర్’ వ్యూహంతో… శత్రువుకు చెక్ పెట్టిన సైన్యం!

Indian Army’s tactical response : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఓ నిశ్శబ్ద యుద్ధం. ‘శత్రువుతో మేం చదరంగం ఆడాం… వాళ్ల కదలికలను ఊహిస్తూ, వ్యూహాత్మకంగా దెబ్బకొట్టాం!’ అంటూ ఆర్మీ స్టాఫ్ చీఫ్ (COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. పహల్గాం ఘటన తర్వాత కేవలం కొద్ది రోజుల్లోనే సైన్యం ఇంతటి భారీ ఆపరేషన్‌ను ఎలా నిర్వహించింది…? ప్రభుత్వ పెద్దలు సైన్యానికి ఇచ్చిన ఆ పూర్తి స్వేచ్ఛ వెనుక కథేంటి..? అసలు ఏమిటీ ఆ ‘గ్రే జోన్’ వ్యూహం..? 

- Advertisement -

పూర్తి స్వేచ్ఛ… పెరిగిన మనోస్థైర్యం :ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. జనరల్ ద్వివేది మాటల్లోనే చెప్పాలంటే, “ఏప్రిల్ 23న మేమందరం సమావేశమయ్యాం. ‘ఇక చాలు’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఏదో ఒకటి చేయాలని త్రివిధ దళాధిపతులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ‘ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి’ అని చెప్పడం ద్వారా రాజకీయ నాయకత్వం మాపై ఉంచిన విశ్వాసం, వారిచ్చిన స్పష్టత మా మనోస్థైర్యాన్ని అమాంతం పెంచింది.” ఈ అపూర్వమైన మద్దతుతోనే సైన్యం ప్రతీకార చర్యలకు పదును పెట్టింది.

చదరంగ వ్యూహం… గ్రే జోన్ ఆపరేషన్ :‘ఆపరేషన్ సిందూర్’ సంప్రదాయ యుద్ధం కాదని, అదో ‘గ్రే జోన్’ ఆపరేషన్ అని జనరల్ ద్వివేది స్పష్టం చేశారు. “మేం శత్రువుతో చదరంగం ఆడాం. వారి తర్వాతి ఎత్తు ఏంటో, మన ప్రతిస్పందన ఏంటో తెలియని సంక్లిష్ట పరిస్థితి అది. సంప్రదాయ యుద్ధానికి దిగకుండా, అంతకంటే తక్కువ స్థాయిలో, అత్యంత వ్యూహాత్మకంగా కదలికలు చేశాం. శత్రువు కూడా ఎత్తులు వేశాడు. కానీ సరైన సమయంలో మేం వారికి చెక్‌మేట్ పెట్టాం,” అని ఆయన వివరించారు. ఈ నిఘా ఆధారిత ఆపరేషన్‌లో భాగంగా ఏప్రిల్ 25న నార్తర్న్ కమాండ్‌ను సందర్శించి, అక్కడ తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలను ధ్వంసం చేసి, అనేక మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు.

సిందూర్’ పేరు వెనుక… దేశాన్ని ఏకం చేసిన భావోద్వేగం: ఈ ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని పేరు పెట్టడం వెనుక బలమైన కారణం ఉందని జనరల్ ద్వివేది తెలిపారు. “ఏప్రిల్ 29న ప్రధానమంత్రిని కలిశాం. ‘ఆపరేషన్ సిందూర్’ అనే ఒక చిన్న పేరు యావత్ దేశాన్ని ఎలా ఏకం చేస్తుందో, ఉత్తేజపరుస్తుందో ముఖ్యం. ఆ పేరే దేశ ప్రజల్లో ఒక కొత్త స్ఫూర్తిని నింపింది,” అని ఆయన అన్నారు. “మీరు ఎందుకు ఆపేశారు..? అని దేశం మొత్తం అడుగుతోంది. దానికి మేం తగిన సమాధానమే ఇచ్చాం,” అని పేర్కొంటూ ఆపరేషన్ తీవ్రతను, విజయాన్ని ఆయన పరోక్షంగా సూచించారు.

సాంకేతికతతో స్వావలంబన : ఐఐటీ మద్రాస్‌లో ‘అగ్నిశోధ్’ అనే ఆర్మీ రీసెర్చ్ సెల్‌ను ప్రారంభిస్తూ జనరల్ ద్వివేది ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ రంగంలో స్వావలంబన ఎంత కీలకమో ‘ఆపరేషన్ సిందూర్’ నొక్కి చెబుతుందని అన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం, సైనిక దళాల పరాక్రమం కలిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ ఆపరేషన్ నిరూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad