Sunday, November 16, 2025
Homeనేషనల్Opposition Slams PM: "ప్రధాని.. ఈ రోజు అలసిపోయారు, రేపు విశ్రాంతి తీసుకుంటారు"

Opposition Slams PM: “ప్రధాని.. ఈ రోజు అలసిపోయారు, రేపు విశ్రాంతి తీసుకుంటారు”

Opposition Slams PM Modi Over RSS Praise: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశంసించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ(ఎం) నాయకులు మోదీ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆయన  తన ‘విశ్రాంతి ప్రయోజనాల’ గురించే ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, “ప్రధాని ఈ రోజు అలసిపోయారు, త్వరలోనే విశ్రాంతి తీసుకుంటారు” అని వ్యాఖ్యానించారు. మోదీ ప్రసంగాన్ని “నిస్సారం, కపటంతో నిండింది” అని విమర్శించారు. వచ్చే నెలలో మోదీకి 75 ఏళ్లు నిండనున్న నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఇదొక ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ఇటీవల 75 ఏళ్లు దాటిన నాయకులు పక్కకు తప్పుకోవాలని సూచించారు. ఆ వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించే చేశారని పలువురు భావిస్తున్నారు.

మరోవైపు, కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షిద్ మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్ర లేదని గుర్తు చేశారు. 52 ఏళ్ల పాటు ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ జెండాను ఎగురవేయడానికి నిరాకరించిందని ఆయన అన్నారు.

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తూ, మోదీ స్వాతంత్ర్య పోరాటాన్ని అగౌరవపరిచారని, ఈ పవిత్రమైన రోజును రాజకీయం చేశారని ఆరోపించారు. “ఒక ‘స్వయంసేవక్’గా ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశంసించాలనుకుంటే నాగ్‌పూర్ వెళ్లి చేయవచ్చు, కానీ ప్రధానిగా ఎర్రకోట నుంచి ఎందుకు చేయాలి?” అని ప్రశ్నించారు. సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ కూడా ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు.

మోదీ తన 103 నిమిషాల ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను “ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ”గా అభివర్ణించారు. ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాల “వ్యక్తి నిర్మాణ్” (వ్యక్తిత్వ నిర్మాణం) మరియు “రాష్ట్ర నిర్మాణ్” (దేశ నిర్మాణం) కృషిని ప్రశంసించారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్ గురించి మోదీ ప్రస్తావించడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad