పహల్గామ్ ఉగ్రదాడి.. ఆపరేషన్ సింధూర్పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పందించారు. ఆదివారం మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. భారత భద్రతా బలగాలు ఈ ఆపరేషన్లో చూపిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడి గర్వాన్ని మరింత పెంచాయని ప్రధాని పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి గట్టి సమాధానంగా నిలిచిందని, ఇది దేశ ప్రజల ఐక్యతను ప్రతిబింబించిందని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ సంఘటనను తమ జీవితాల్లో ఒక మలుపుగా తీసుకున్నారని, తమ ఇంటి కథల్లోనూ ఈ పరాక్రమం చోటు చేసుకుందని ఆయన అన్నారు.
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి వెనుక ఉన్న కుట్రను ఉద్దేశిస్తూ, అభివృద్ధి బాటలో పరుగులు పెడుతున్న జమ్మూ కాశ్మీర్ను మళ్లీ అశాంతికి లోను చేయాలనే కుట్రదారుల ప్రయత్నమిది అని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ భారత ఆర్మీ, ప్రజల సంకల్పం ముందు అలాంటి ప్రయత్నాలు ఎప్పటికీ విఫలమవుతాయన్నారు.
ఆపరేషన్ సింధూర్ ఒక సైనిక విజయమే కాకుండా, దేశ ప్రజల సంకల్పానికి నిలువెత్తు నిదర్శనమని ప్రధాని చెప్పారు. సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేసిన దాడులు ఉగ్రవాదానికి చుక్కలు చూపించాయని, దేశం మొత్తము టెర్రరిజంపై పోరాటంలో ఒకతాటిపై ఉందని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో 140 కోట్ల భారతీయుల మద్దతు భారతదేశానికి గట్టి బలంగా నిలుస్తోందని, ఉగ్రవాదాన్ని సమూలంగా నశింపచేయడమే ప్రతి పౌరుడి సంకల్పమని మోదీ భావోద్వేగంగా వెల్లడించారు.