జమ్మూకశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరిగిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడటంతో పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో హార్స్ రైడర్ సయీద్ అదిల్ హుస్సేన్ షా ఉగ్రవాదులపై వీరోచితంగా పోరాటం చేశాడు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వారి నుంచి తుపాకీ లాక్కొనేందుకు తీవ్రంగా పోరాడాడు. అయితే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ అనే సుందర పర్యటక ప్రదేశానికి చేరుకోవాలంటే నడక, గుర్రపుస్వారీ తప్ప మరో రవాణా సదుపాయం లేదు. పర్యాటకులను అదిల్ హుస్సేన్ షా గుర్రం మీద తీసుకువెళ్లిన సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.