ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న చర్యలపై దాయాది పాకిస్తాన్(Pakistan) కూడా ప్రతీకార చర్యలకు దిగింది. సిమ్లా ఒప్పందం సహా భారత్తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలుపుదల చేసుకునే హక్కును వినియోగించుకుంటామని తెలిపింది. ఎక్కడ ఉగ్రదాడి జరిగినా పాకిస్తాన్ నిందించడం అలవాటు అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రత కమిట సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆర్మీ అధికారులతో పాటు కీలక అధికారులు పాల్గొన్నారు.
సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడాన్ని తీవ్రంగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీనిని యుద్ధ చర్యగా భావిస్తున్నట్లు పేర్కొంది. సింధూ నదిలో నీటి వాటాపై తాము ఐక్యరాజ్య సమితిలో సవాలు చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వ పక్షాన ఐదుగురు సభ్యులతో కమిటీ వేయనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ కోర్టులో ఎదుర్కోవాలని నిర్ణయించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపింది. తక్షణం సైన్యానికి సెలవులు రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. వాఘా బార్డర్ మూసి వేస్తున్నట్టు వెల్లడించింది. పాకిస్తాన్లో ఉంటున్న భారతీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని సూచించింది.