జమ్ముకాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడికి(Pahalgam Terror attack) సూత్రధారి పాకిస్థాన్ ఉగ్రవాది, లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జుట్గా(Saifulla Sajid Jutt)జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అనుమానిస్తున్నారు. పాక్ ఐఎస్ఐ, ఆర్మీ ఉన్నతాధికారులతో సైఫుల్లాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. ప్రస్తుతం ఇస్లామాబాద్లోని లష్కరే స్థావరం నుంచి పనిచేస్తున్నట్లు తెలిపారు. 45 ఏళ్ల వయస్సు ఉన్న సైఫుల్లా కశ్మీరీ మహిళను వివాహం చేసుకున్నాడని చెబుతున్నారు.
పహల్గామ్ సమీపంలోని కొండ ప్రాంతాల నుంచి వచ్చిన ఉగ్రవాదులు తొలుత పర్యాటకుల గుర్తింపు కార్డులు అడిగారు. వీరిలో ముస్లిమేతరులను వేరు చేసి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొత్తం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మహిళలను, పిల్లలను మాత్రం వదిలేశారు. ఉగ్రదాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న ఆర్మీ జవాన్లు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ దాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే శ్రీనగర్ చేరుకుని ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా సౌదీ అరేబియా పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు.