Saturday, November 15, 2025
Homeనేషనల్Parliament Session : సభలో సమరం.. సర్కారు 8 బిల్లులు - విపక్షాల 8 విమర్శనాస్త్రాలు!

Parliament Session : సభలో సమరం.. సర్కారు 8 బిల్లులు – విపక్షాల 8 విమర్శనాస్త్రాలు!

Parliament session clashes over new bills : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు తెరలేచింది. ప్రజాస్వామ్య దేవాలయం మరోసారి వాడీవేడి చర్చలకు, తీవ్ర వాదోపవాదాలకు వేదిక కానుంది. ఓవైపు కీలకమైన ఎనిమిది బిల్లులను చట్టరూపంలోకి తీసుకురావాలని అధికార పక్షం వ్యూహాలు రచిస్తుంటే, మరోవైపు పహల్గాం దాడి నుంచి ‘ఆపరేషన్ సిందూర్’ వరకు ఎనిమిది కీలక విమర్శనాస్త్రాలను సంధించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సిద్ధమైంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభా గౌరవాన్ని కాపాడాలని సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్న వేళ, ఈ అస్త్రశస్త్రాల హోరులో ప్రజా గొంతుకకు చోటు దక్కుతుందా ? ఈ సమావేశాలు దేశానికి దిశానిర్దేశం చేస్తాయా..? లేక వాయిదాల పర్వంతోనే సరిపెడతాయా..?

- Advertisement -

సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి. మధ్యలో సెలవులతో కలిపి మొత్తం 21 రోజుల పాటు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. అయితే, తొలిరోజు నుంచే సభా వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాలు తమ తమ అజెండాలతో సిద్ధంగా ఉండటంతో ఈ సమావేశాలు అత్యంత కీలకంగా మారాయి.

విపక్షాల పదునైన అస్త్రాలు: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి సున్నితమైన అంశాల తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో, వీటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ‘ఇండియా’ కూటమి పక్కా ప్రణాళికతో ఉంది. వారి అమ్ములపొదిలోని ప్రధాన అస్త్రాలు ఇవే..

01. పహల్గాం ఉగ్రదాడి: ప్రభుత్వ భద్రతా వైఫల్యంపై నిలదీయడం.

02. ఆపరేషన్ సిందూర్: ఆపరేషన్‌ను ఆకస్మికంగా ఎందుకు నిలిపివేశారో దేశానికి వివరించాలని డిమాండ్.

03. ట్రంప్ వ్యాఖ్యలు: భారత్-పాక్ కాల్పుల విరమణ, వాణిజ్యంపై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ స్పష్టత.

04.బిహార్ ఎస్ఐఆర్: బిహార్‌లో జరుగుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ (ఎస్ఐఆర్) పై చర్చ

05. ఎయిర్ ఇండియా ప్రమాదం: భద్రతా వైఫల్యాలు, డీజీసీఏ తీసుకున్న చర్యలపై వివరణ.

06. జమ్మూకశ్మీర్ హోదా: కాంగ్రెస్ పార్టీ, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం బిల్లు పెట్టాలని ఒత్తిడి.

07.డీజీసీఏ ఆడిట్లు: భద్రతా ఉల్లంఘనలపై డీజీసీఏ తీసుకున్న చర్యలపై ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ప్రశ్న.

08. విమానయాన భద్రత: ప్రయాణికుల భద్రతపై ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ప్రశ్న.

ప్రభుత్వ శాసన వ్యూహం: విపక్షాల విమర్శలను ఎదుర్కొంటూనే, తమ శాసనపరమైన అజెండాను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ సమావేశాల్లో సుమారు 17 బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నా, కనీసం 8 కీలక బిల్లులపై దృష్టి సారించింది.

మణిపుర్ జీఎస్టీ (సవరణ) బిల్లు, 2025
జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2025
ఐఐఎం (సవరణ) బిల్లు, 2025
పన్ను చట్టాల (సవరణ) బిల్లు, 2025
జియో హెరిటేజ్ సైట్స్ అండ్ జియో రెలిక్స్ (సంరక్షణ, నిర్వహణ) బిల్లు, 2025
గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, 2025
జాతీయ క్రీడా పాలన బిల్లు, 2025
జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు
వీటితో పాటు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

చర్చకు సిద్ధం.. కానీ షరతులు వర్తిస్తాయి: విపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అయితే, చర్చలు సభా నియమ నిబంధనల ప్రకారమే జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ వంటి కీలక అంశాలపై ప్రధాని మోదీ కాకుండా, సంబంధిత శాఖ మంత్రి అయిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సవివర ప్రకటన చేస్తారని ప్రభుత్వ వర్గాలు సూచించాయి. ఏ అంశంపై ఎప్పుడు చర్చించాలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయిస్తుందని, తొలిరోజే గందరగోళం సృష్టించడం సరికాదని ప్రభుత్వం విపక్షాలకు హితవు పలికింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad