Parliament Monsoon: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. రేపటి నుండి అనగా జూలై 21 (సోమవారం) నుంచి ఆగస్టు 21 వరకు నెల రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ నెల రోజుల్లో మొత్తం 21 సెషన్లు జరగనున్నాయి. అయితే ఆగస్టు 12 నుంచి 18 వరకు రక్షాబంధన్, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సమావేశాలు జరగవు.
రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లులు ఈ విధంగా ఉన్నాయి. భూ-సంపద స్థలాలు, భూపరిరక్షణ నిర్వహణ బిల్లు, జాతీయ క్రీడా పాలన బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు, గనులు మరియు ఖనిజాల సవరణ బిల్లు, జన్ విశ్వాస్ బిల్లు, జాతీయ యాంటీ-డోపింగ్ బిల్లు, భారతీయ నిర్వహణ సంస్థల బిల్లు సహా పన్ను చట్టాల బిల్లు ఉన్నాయి.
ALSO READ: https://teluguprabha.net/national-news/bihar-school-under-tree-23-years/
వీటితో పాటు ఆదాయపు పన్ను బిల్లు 2025ని కూడా ఇదే సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించినా.. సెలెక్ట్ కమిటీకి పంపించారు. తాజాగా ఈ కమిటీ నుంచి తుది నివేదికను క్యాబినేట్ స్వీకరించింది. దీన్ని సోమవారం (జులై 21) లోక్సభలో సమర్పించే అవకాశం ఉంది.
ALSO READ: https://teluguprabha.net/national-news/shashi-tharoor-said-i-have-some-differences-with-congress/
ఇదిలా ఉండగా మణిపూర్లో రాష్ట్రపతి పాలనను పొడిగించడంతో పాటు రాష్ట్ర డిమాండ్ ఫర్ గ్రాంట్స్ను ఆమోదించేందుకు కేంద్రం పార్లమెంట్ అనుమతిని కోరనుంది. దీనితో పాటు వ్యాపార నౌకాయాన బిల్లు 2024, గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య సర్దుబాటు బిల్లు 2024, భారతీయ ఓడరేవుల బిల్లు 2025 లను కూడా లోక్సభలో ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయి.
ఈ సమావేశాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్-పాకిస్థాన్ యుద్ధ విరమణపై అమెరికా జోక్యం సహా బిహార్ ఎన్నికల జాబితా వంటి అంశాలపై ఈ సమావేశాల్లో వాడివేడి చర్చనీయాంశాలుగా ఉన్నాయి.


