అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం సివిల్ ఆసుపత్రి సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ(BJ Medical College) బిల్డింగ్, జనావాసాలపై కూలింది. ఈ ఘటనలో మెడికల్ కాలేజ్ బిల్డింగ్ రెండు అంతస్తుల వరకు భారీగా మంటలు అంటుకున్నాయి. మధ్యాహ్న సమయం కావడంతో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ భోజనానికి వచ్చారు. ఆ సమయంలోనే ఒక్కసారిగా విమానం కూలడంతో(Plane Crash) 20 మందికి పైగా మెడీకోలు అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం. మరింత మంది మృతి చెందే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అగ్ని మాపక సిబ్బంది సహాయంతో మంటలు అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులతో సమీప ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.
విమానంలో మొత్తం 254 మంది ఉండగా.. వీరిలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నట్లుగా తెలుస్తోంది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే సిగ్నల్స్ కోల్పోయినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ (DGCA) ధృవీకరించింది. పైలట్లు ‘‘మేడే మేడే’’ అంటూ అహ్మదాబాద్ ఏటీసీకి అత్యవసర సందేశం పంపించారని.. ఆ తర్వాత ఎలాంటి సందేశం రాలేదని తెలిపింది. ఈ విమానం కెప్టెన్గా సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుందర్ ఉన్నారని తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్ 8,200 గంటల అనుభవం.. కోపైలట్కు 1100 గంటల విమానయాన అనుభవం ఉందని పేర్కొంది.