Saturday, November 15, 2025
Homeనేషనల్Vice President Polls: ఉపరాష్ట్రపతి పీఠంపై రాధాకృష్ణన్... ఏకగ్రీవానికి విపక్షాలు సహకరించాలన్న ప్రధాని!

Vice President Polls: ఉపరాష్ట్రపతి పీఠంపై రాధాకృష్ణన్… ఏకగ్రీవానికి విపక్షాలు సహకరించాలన్న ప్రధాని!

Unanimous election of Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరు ఖరారైన వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకగ్రీవ మంత్రాన్ని పఠించారు. దేశ రెండవ అత్యున్నత పదవికి జరిగే ఈ ఎన్నికలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరున్న రాధాకృష్ణన్ అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు ఎన్డీఏ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరి ప్రధాని విజ్ఞప్తికి ప్రతిపక్షాల స్పందన ఎలా ఉండనుంది..? ఈ ఎన్నిక ఏకగ్రీవంగా ముగుస్తుందా లేక పోటీ అనివార్యమవుతుందా..?

- Advertisement -

దేశ నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న తరుణంలో, అధికార ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థి, బీజేపీ సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరుతూ ప్రతిపక్షాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. మంగళవారం పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో జరిగిన ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశంలో ఈ మేరకు ఆయన తన ఆకాంక్షను వెలిబుచ్చారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌ను కూటమి ఎంపీలకు పరిచయం చేసి, ఆయన సుదీర్ఘ ప్రజా జీవితాన్ని, నిరాడంబరతను కొనియాడారు. అనంతరం ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులు రాధాకృష్ణన్‌ను సత్కరించారు.

సహకరించాలని మోదీ పిలుపు : సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలను వివరించారు. రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని ప్రధాని అన్ని పార్టీలకు, ముఖ్యంగా ప్రతిపక్షాలకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఎలాంటి వివాదాలు గానీ, మచ్చ గానీ లేని స్వచ్ఛమైన రాజకీయ జీవితం గడిపిన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం దేశానికే గర్వకారణమని ప్రధాని అన్నట్లు రిజిజు పేర్కొన్నారు. ఆయన ఎన్నిక దేశానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అభిప్రాయపడ్డారు.

వివాదరహితుడు.. సౌమ్యశీలి : ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలు అందిస్తున్న చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్, గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. తమిళనాడుకు చెందిన ఈయన, రెండుసార్లు కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. పార్టీలో పలు కీలక పదవులు చేపట్టి, క్షేత్రస్థాయి కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఉన్నతస్థాయికి ఎదిగారు. ఆయన నిరాడంబర జీవనశైలి, వివాదరహిత వ్యక్తిత్వం కారణంగానే ఎన్డీఏ ఆయన వైపు మొగ్గుచూపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అనివార్యమైన ఎన్నిక.. ఖాయమైన గెలుపు : ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్య కారణాలతో తన పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో, లోక్‌సభ, రాజ్యసభల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్నందున రాధాకృష్ణన్ గెలుపు లాంఛనప్రాయమే. అయినప్పటికీ, ఏకగ్రీవం ద్వారా రాజకీయ సయోధ్యను చాటాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే రాధాకృష్ణన్ బుధవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad