PM Modi West Bengal Elections: వెస్ట్ బెంగాల్లో బీజేపీ సంచలన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది బెంగాల్ ప్రజల విజయమని కొనియాడారు. బీజేపీని గెలిపించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/manchu-lakshmi-wishes-to-trisha-krishnan-on-her-birthday/
‘బెంగాల్లో కమలం వికసించింది. ఇక్కడి ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారు. కార్యకర్తల సుదీర్ఘ కల, శ్రమ ఫలించాయి. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. నితిన్ నబీన్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక జరిగిన తొలి ఎన్నిక ఇది. బెంగాల్లోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రవేశించింది. ఓటర్లు కొత్త రికార్డు సృష్టించారు.’ -ప్రధాని మోదీ
బెంగాల్ ఫలితం కేవలం రాజకీయ విజయం మాత్రమే కాదని, ఇది ప్రజాస్వామ్య విజయం అని మోదీ పేర్కొన్నారు. గతంలో ఎన్నికల సమయంలో ఇక్కడ హింస, భయాందోళనలు ఉండేవని.. కానీ ఈసారి శాంతియుత వాతావరణంలో ఓటింగ్ జరగడం శుభపరిణామమని తెలిపారు. ఈ విజయం బెంగాల్లో రాజకీయ హింసకు ముగింపు పలుకుతుందని, ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఆరంభమని వ్యాఖ్యానించారు. “హింస గెలవలేదు, ప్రజాస్వామ్యం గెలిచింది” అని సోషల్ మీడియా వేదికగా ఆయన నినదించారు.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-expresses-joy-over-udfs-victory-in-keralam/
బెంగాల్లో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని మోదీ వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు భయం నుంచి విముక్తి పొందారని.. ఇకపై ఇక్కడ భయాందోళనలు ఉండవని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్లో చొరబాటుదారులకు ప్రధాని మోదీ హెచ్చరిక జారీ చేశారు. చొరబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, వారిని అడ్డుకుంటామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ తప్ప తమకు మరో లక్ష్యం లేదని మోదీ వెల్లడించారు. కాగా, మొత్తం 293 స్థానాలకు గాను బీజేపీ 208 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

