Vande Bharat Trains: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. ఇది దేశ రైల్వే చరిత్రలో మరో ముందడుగు అని చెప్పుకోవచ్చు. ఈ కొత్త రైళ్లు జనారస్-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్పూర్- ఢిల్లీ, ఎర్నాకులం- బెంగళూరు మార్గాల్లో ప్రారంభించబడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల మెుత్తం సంఖ్య 164కు చేరుకుంది.
నవంబర్ 8న నిర్వహించిన ప్రోగ్రామ్లో మోదీ.. ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలను మరింత విస్తరించారు. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలను అందించడంలో ఇది ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా పర్యాటక అభివృద్ధి, ప్రాంతీయ రవాణా మెరుగుదల, ఆర్థిక కార్యకలాపాలకు వందే భారత్ రైళ్లు సహాయపడతాయి.
కొత్త రైళ్ల విశేషాలు ఇలా..
జనారస్ – ఖజురహో మార్గంలోని వందే భారత్ రైలు ఇతర ప్రత్యేక రైళ్లతో పోలిస్తే దాదాపు 2 గంటల 40 నిమిషాల ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది. ఇది వారణాసి, ప్రయాగరాజ్, చిత్రకూట్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను నేరుగా అనుసంధానిస్తోంది.ఇక లక్నో – సహరాన్ఫూర్ రైలు దాదాపు 7 గంటల 45 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఇది రూర్కీ మీదుగా హరిద్వార్ను కలుపుతూ.. ప్రయాణికులకు భారీగా ప్రయోజనం చేకూర్చనుంది. అలాగే ఫిరోజ్పూర్– ఢిల్లీ రైలుతో పంజాబ్లోని ముఖ్యనగరాల నుంచి దేశ రాజధానికి ప్రయాణ సమయం తగ్గనుంది. చివరిగా ఎర్నాకులం–బెంగళూరు రైలు దక్షిణ భారత ప్రాంతాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని వెల్లడైంది.
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు దేశవ్యాప్తంగా ఆదరణ..
దేశంలో మొదటి వందే భారత్ రైలు 2019లో ప్రారంభమైంది. ప్రస్తుతం 164 వందే భారత్ రైళ్లు వివిధ రాష్ట్రాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఈ రైళ్లలోని ఆధునిక సదుపాయాలు, వేగవంతమైన ప్రయాణంతో రైల్వేలు కొత్త ఒరవడి ఆవిష్కరించాయి. ముఖ్యంగా పర్యాటక గమ్యస్థానాలకు, ప్రధాన నగరాలకు కనెక్టివిటీ పెరిగింది. ఇది సాధారణ ప్రయాణికులకు మాత్రమే కాకుండా.. పర్యాటకులు, వ్యాపార వర్గానికి కూడా ప్రయోజనాల్ని అందిస్తోంది. అధికారులు, ప్రయాణికులు ఈ వందే భారత్ రైళ్ల ద్వారా ఉన్న వేగం ఒక్కటే కాకుండా సౌకర్యాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


