PM Modi Manipur Visit: మణిపూర్లో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. సుమారు రూ. 8,500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు పీఎం మోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
రెండేళ్ల తర్వాత మణిపూర్కు
మే, 2023లో మణిపూర్లో మైతీ, కుకీ వర్గాల మధ్య తీవ్రమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 13న ఆయన పర్యటన ఖరారైన నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. హింస కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 260 మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం మణిపూర్లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగా, అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచారు.
Also Read: https://teluguprabha.net/national-news/supreme-court-refuses-to-hear-kangana-ranauts-petition/
పలు అభివృద్ధి పనులు
రెండేళ్ల తర్వాత మొదటిసారిగా ఆ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మణిపూర్తో పాటు మిజోరం, అస్సాం, బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో ఈ నెల 13 నుంచి 15 వరకు మోదీ పర్యటించనున్నారు. సమగ్ర, సుస్థిర, సమృద్ధికరమైన అభివృద్ధి సాధించే దిశగా ప్రధాని మోదీ పర్యటన ఉండనుంది. మణిపూర్లోని చురాచాంద్పుర్లో సుమారు రూ. 7300 కోట్లకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మణిపూర్ అర్బన్ రోడ్స్, డ్రైనేజీ, అసెట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కోసం రూ. 3600 కోట్లు కేటాయించగా.. రూ. 2500 కోట్ల నిధులతో 5 జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, 9 ప్రదేశాల్లో వర్కింగ్ వుమెన్స్ హాస్టల్స్ నిర్మాణం కోసం నిధులు కేటాయించారు. ఇంపాల్లో సుమారు రూ. 1200 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ఆవిష్కరించనున్నారు. మొత్తంగా ఈశాన్య రాష్ట్రాల్లో సుమారు రూ. 71,850 కోట్ల నిధులతో పలు ప్రాజెక్టులకు బీజం పడంది. అదేవిధంగా బిహార్లో జాతీయ మకానా బోర్డును మోదీ ప్రారంభిస్తారు.
ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేసేందుకు.. బిహార్లోని పుర్నియా విమానాశ్రయంలో కొత్త టర్మినల్ బిల్డింగ్ ప్రారంభం కానుంది. పుర్నియాలో సుమారు రూ. 36 వేల కోట్ల నిధులతో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మిజోరంలోని ఐజ్వాల్లో సుమారు రూ. 9 వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభంకానున్నాయి. ఇంకా మిజోరంలో బైరాబి-సైరంగ్ మధ్య కొత్త రైల్వే లైన్ను మోదీ ప్రారంభిస్తారు.
Also Read: https://teluguprabha.net/national-news/delhi-high-court-bomb-threat-evacuation/
ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా గౌహతిలో జరగనున్న డాక్టర్ భూపెన్ హజారికా శత జయంతి ఉత్సవాల్లో మోదీ పాల్గొననున్నారు. అనంతరం అస్సాంలో సుమారు 18,350 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
రాహుల్ హర్షం
కాగా ప్రధాని మోదీ మణిపూర్ పర్యటనపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, సీపీఎం నేత బృందా కారత్ స్పందించారు. మణిపూర్ అల్లర్ల సమయంలో ఆ రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం నెలకొందని.. ఇప్పటివరకూ అక్కడికి వెళ్లకపోవడంపై బృందా కారత్ అసహనం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న అక్రమాలపై ఆయన బాధ్యత తీసుకోవడం లేదని మండిపడ్డారు. మణిపూర్లో మోదీ పర్యటనపై హర్షం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ.. ప్రస్తుతం ఓటు చోరీ అంశం కీలకమని.. ఓటు చోరీ కారణంగా హరియాణా, మహారాష్ట్రల ఎన్నికల ఫలితాలు మారిపోయాయని ఆరోపించారు.


