PM Modi Satires on BJP and Rahul gandhi on Bihar Elections: బీహార్ సార్వత్రిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే బీహార్లో మొదటి దశ ఎన్నికలు ముగియగా.. అక్టోబర్ 11న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సీతామర్హిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. బీహార్ విద్యార్థులకు మేము ల్యాప్టాప్లు ఇందిస్తే వాళ్లు రివాల్వర్లు ఇస్తున్నారంటూ ఆర్డేడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “విద్యార్థులకు మేము కంప్యూటర్లు, ఫుట్బాల్, హాకీ స్టిక్లు ఇస్తున్నాం. ఆర్జేడీ మాత్రం ప్రజలకు రివాల్వర్లు ఇవ్వడంపై మాట్లాడుతోంది. ప్రజలు తుపాకుల ప్రభుత్వం కావాలని కోరడం లేదు. ఆర్జేడీ ఎన్నికల ప్రచారంలో జంగిల్రాజ్ పాటలు, నినాదాలు వింటే షాక్ అవుతారు. పిల్లలను దోపిడీదారులుగా మార్చేందుకు ఆర్జేడీ నేతలు యత్నిస్తున్నారు. బిహార్లో పిల్లలు డాక్టర్లు కావాలా లేదా దోపిడీదారులు కావాలా ?. మన పిల్లలను చెడ్డవాళ్లుగా చేయాలనుకునేవారిని మనం గెలిపిస్తామా?. కాంగ్రెస్,ఆర్జేడీకి పరిశ్రమలకు సంబంధించి ఏ,బీ,సీ,డీలు కూడా తెలియవు. కానీ పరిశ్రమలను మాత్రం ఎలా మూసివేయాలో తెలుసు. జంగిల్ రాజా 15 ఏళ్ల పాలనలో బీహార్లో పెద్ద ఆస్పత్రి గానీ.. వైద్య కళాశాల కానీ ఏర్పాటు చేయలేదు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి వచ్చాకే ఇక్కడి ప్రజలకు నమ్మకం వచ్చింది. పెట్టుబడిదారులు బీహార్కు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను నిందించిన వాళ్లను ఎన్నికల్లో శిక్షించాలి.” అంటూ ఓటర్లను కోరారు.
రాహుల్ గాంధీపై మోదీ సెటైర్లు..
ప్రధానమంత్రి మోదీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బెగుసరాయ్లో చేపట్టిన చేపల వేట ప్రయత్నంపై పరోక్షంగా చురకలు అంటించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో బీహార్ మత్స్య పరిశ్రమ అద్భుతమైన వృద్ధి సాధించింది. “కొంతమంది ఇప్పుడు రాష్ట్రంలోని చెరువులలో మునకలు సాధన చేస్తున్నారు,” అని మోదీ అన్నారు. “పెద్ద పెద్ద నాయకులు కూడా ఇక్కడి చేపలను చూడటానికి వస్తున్నారు. నీటిలో మునకలు వేస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో మునిగిపోవడానికి ముందస్తుగా సాధన చేస్తున్నారు” అంటూ రాహుల్ గాంధీ బెగుసరాయ్ పర్యటనను ఎద్దేవా చేశారు. ఎన్నికల ర్యాలీ తర్వాత రాహుల్ గాంధీ భర్రా గ్రామంలోని చెరువును సందర్శించారు. స్థానిక మత్స్యకారులతో కలిసి చేపలు పట్టారు. కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్, వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ అధ్యక్షుడు ముఖేష్ సహాని రాహుల్తో ఉన్నారు. చెరువు వద్ద చిన్న పడవలో ప్రయాణించిన రాహుల్ గాంధీ తరువాత కన్హయ్యతో కలిసి నీటిలోకి దిగడం గ్రామస్తుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆయన చేపల వలలు లాగడానికి సహాయం చేశారు. ఇదిలా ఉంటే, సీతామర్హి ర్యాలీలో ప్రధాని మోదీ తాను “బీహార్ కళలకు బ్రాండ్ అంబాసిడర్” అని అభివర్ణించుకున్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి నివాళిగా ఇటీవల అర్జెంటీనా ఉపాధ్యక్షుడికి ఒక మధుబని పెయింటింగ్ను బహూకరించిన విషయాన్ని గుర్తు చేశారు. “మన సంస్కృతి సంప్రదాయాలను అవమానించే వారు తప్పక ఎన్నికల్లో శిక్షకు గురవ్వాలి,” అని ఆయన అన్నారు.


