పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor)పై ప్రధాని మోదీ(PM Modi) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను మన క్షిపణి వ్యవస్థలు ధ్వంసం చేశాయన్నారు. ఆపరేషన్ సిందూర్ భారతదేశ ‘సైనిక శక్తి’ని ప్రపంచానికి చాటిచెప్పిందని తెలిపారు. ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్ సైన్యానికి నిద్రలేని రాత్రులను మిగిల్చిందని పేర్కొన్నారు.
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్ సభలో మాట్లాడిన మోదీ.. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారత సైన్యం పనితీరుపై ప్రశంసలు కురిపించారు. భారత సైన్యం దాడులకు దిగివచ్చిన పాకిస్థాన్.. యుద్ధాన్ని ముగించాలంటూ వేడుకుందన్నారు. అణ్వాయుధ బెదిరింపులకు భారత్ భయపడదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ కుట్రలు, కుతంత్రాలు ఇక పనిచేయవని స్పష్టం చేశారు. ప్రతి ఉగ్రదాడికి తగిన సమాధానం చెప్పడమే భారత్ సిద్ధాంతమని మోదీ వెల్లడించారు.