భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ అనంతరం ప్రధాని స్పందించనున్నప్పటికి, ఆయన ఏమి చెబుతారన్నదానిపై దేశమంతటా ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై దేశంపై జరిగే ఉగ్రదాడులను యుద్ధదాడులుగానే పరిగణిస్తామని, అటువంటి ఏదైనా చర్యలకు కఠిన ప్రతిచర్య ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదిలా ఉండగా, భారత్–పాక్ మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయిలో కీలక చర్చలు కాసేపట్లో జరగనున్నాయి. అసలు ఈ చర్చలు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డాయి. చర్చలకు ముందు భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఆపరేషన్ సిందూర్ పై కీలక వివరాలను వెల్లడించారు.
ఇక పాకిస్తాన్ వైఖరి మాత్రం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ సరిహద్దుల్లో వరుసగా కాల్పులు జరపడం, డ్రోన్ల ద్వారా దాడుల కుట్రలు సాగించడం దుందుడుకు చర్యలే. భారత్ ఇప్పటికే హెచ్చరించినట్లే, ఇటువంటి దాడులకు ఇకపై తీవ్ర ప్రతిస్పందన తప్పదని ఆర్మీ వర్గాలు హెచ్చరించాయి.