PM Modi Croatia Visit: భారత ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో భాగంగా బుధవారం క్రొయేషియాలో పర్యటించారు. క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్ ప్లెన్కోవిచ్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలకడం విశేషం. ఈ సందర్భంగా కొందరు క్రొయేషియన్ పౌరులు గాయత్రి మంత్రంతో అపూర్వంగా ఆహ్వానం పలికారు. మోదీ కూడా వారితో కలిసి గాయత్రి మంత్రంతో పాటు ఇతర శ్లోకాలను పఠించారు. మోదీ రాకతో ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో ఆ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. అలాగే భారతీయ సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ అపురూప ఘటనను ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సాంస్కృతిక బంధాలు బలంగా, ఉత్సాహపూరితంగా ఉన్నాయని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి క్రొయేషియాలో ఇంతటి గౌరవం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. క్రొయేషియాలోని భారత సంతతి ఆ దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడిందన్నారు. అయినా కానీ తమ భారతీయ మూలాలు మర్చిపోకుండా వారు కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. జాగ్రెబ్లో తనకు లభించిన అపూర్వ స్వాగతం.. ఇరు దేశాల మధ్య బందాన్ని మరింత బలోపేతం చేస్తోందని ఆశిస్తున్నానని అని వెల్లడించారు.
ఈ పర్యటనలో భాగంగా క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలానోవిక్, ప్రధాని ఆండ్రేజ్ ప్లెంకోవిక్లతో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. విద్య, ఐటీ, స్టార్టప్లు, పునరుత్పాదక శక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి వంటి రంగాల్లో సహకార ఒప్పందాలపై చర్చించారు. అనంతరం భారతీయ వ్యాపారవేత్తలతో సమావేశమై వాణిజ్య, పెట్టుబడి అవకాశాలపై మంతనాలు జరిపారు.
కాగా జీ7 సదస్సులో భాగంగా కెనడా వెళ్లిన ప్రధాని మోదీ.. పలు ప్రపంచ దేశాల నేతలతో చర్చలు జరిపారు. అనంతరం కెనడా నుంచి క్రొయేషియా చేరుకున్నారు. అంతకుముందు ద్వీప దేశం సైప్రస్ను కూడా సందర్శించి కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ముఖ్యంగా ఇండియా-మిడిలీ ఈస్ట్-యూరప్ కారిడార్ ప్రాజెక్టులో భాగస్వామ్యంపై చర్చించారు. మారిటైం, రక్షణ, సైబర్ భద్రత రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు.