Wednesday, June 25, 2025
Homeనేషనల్Shubhanshu: శుభాంశు అంతరిక్ష యాత్ర విజయవంతంపై ప్రధాని మోదీ హర్షం

Shubhanshu: శుభాంశు అంతరిక్ష యాత్ర విజయవంతంపై ప్రధాని మోదీ హర్షం

PM Modi wishes success to Shubhanshu Shukla: యాక్సియం-4 (Axiom-4)మిషన్ లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు.

భారతదేశం, హంగేరీ, పోలాండ్, అమెరికా వ్యోమగాలులతో కూడిన అంతరిక్ష మిషన్ ప్రయోగం విజయవంతం కావడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ఈసందర్భంగా వ్యోమగాములకు అభినందనలు తెలిపారు. ఇక భారత వ్యోమగామి, మిషన్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచారని ప్రశంసించారు. 140 కోట్ల మంది భారతీయుల కలలు, కోరికలు, ఆశలు, ఆకాంక్షలను మోసుకెళ్లారని పేర్కొన్నారు.

- Advertisement -

ఇక భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అభినందనలు తెలిపారు. గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా భారతదేశానికి అంతరిక్షంలో కొత్త మైలురాయిని సృష్టిస్తున్నందుకు దేశం మొత్తం గర్వంగా ఉందన్నారు. అతడితో పాటు హంగేరీ, పోలాండ్, అమెరికాకు చెందిన వ్యోమగాములు కలిసి ప్రపంచం ఒకే కుటుంబం అని నిరూపించారని తెలిపారు. నాసా, ఇస్రో మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఈ మిషన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వ్యోమగాములు చేపట్టబోయే విస్తృత శ్రేణి ప్రయోగాలు, శాస్త్రీయ అధ్యయనాలు అంతరిక్ష పరిశోధనల్లో కొత్త సరిహద్దులకు దారితీస్తాయని ఆమె పేర్కొన్నారు.

కాగా బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి యాక్సియం-4 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా 28 గంటల తర్వాత గురువారం సాయంత్రం 4. 30 గంటలకు ఐఎస్‌ఎస్‌తో వీరి వ్యోమనౌక అనుసంధానం కానుంది. ఈ మిషన్ కోసం భారత్ రూ. 550 కోట్లు ఖర్చు చేయనుంది. 14 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌లో శుభాంశు టీమ్ గడపనుంది. 40 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారత వ్యోమగామిగా శుభాంశు చరిత్ర సృష్టించారు. చివరగా 1984లో రాకేశ్‌శర్మ అంతరిక్ష ప్రయాణం చేశారు. కాగా ఈ మిషన్ ఇప్పటివరకు ఆరుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News