PM Modi about Parliament Constituencies Delimitation: పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని స్పష్టం చేశారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ సీట్లు కోల్పోతాయనడం అవాస్తవమన్నారు. జనాభా తగ్గితే సీట్లు తగ్గుతాయనడం అబద్ధమని వెల్లడించారు.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల సంఖ్య తగ్గుతుందనే ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టతనిచ్చారు. జనాభా నియంత్రణలో విజయవంతమైన దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు తగ్గుతాయన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ద్వారా ఏ ఒక్క రాష్ట్రం కూడా నష్టపోదన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు పార్లమెంట్ తగిన చర్యలు తీసుకుంటుందని మోదీ హామీ ఇచ్చారు.
‘లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి 816కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని అమలు చేయడానికి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఎంతో కీలకం.’- అని ప్రధాని మోదీ అన్నారు.
ఈ మేరకు డీలిమిటేషన్పై చట్ట సవరణల కోసం ఏప్రిల్ 16- 18 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. కేవలం జనాభా పెరుగుదల ఆధారంగానే కాకుండా, రాష్ట్రాల ప్రస్తుత బలానికి అనుగుణంగా సీట్ల పెంపు ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు సూచిస్తుండగా.. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ ప్రాతినిథ్యం కూడా పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఈ డీలిమిటేషన్ ప్రక్రియను 2029 ఎన్నికల నాటికి అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

