Prakash Raj Controversy: శ్రీరాముడిపై వ్యాఖ్యల వివాదంలో సినీ నటుడు ప్రకాష్రాజ్ వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. తనపై నిందలు వేస్తున్న వారికి సమాధానం చెప్తానని స్పష్టం చేశారు.
శ్రీరాముడిపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నటుడు ప్రకాష్ రాజ్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. కేరళలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో తాను చేసిన ప్రసంగాన్ని కావాలనే వక్రీకరించారని ఆరోపించారు. తాను శ్రీరాముడిని ఎగతాళి చేయలేదని, తన మాటలను కొన్ని వర్గాలు కావాలనే తప్పుగా చిత్రీకరించాయని పేర్కొన్నారు.
‘హిందూ ధర్మాన్ని, శ్రీరాముడిని వెటకారం చేశానని అంటున్నారు. అన్ని ధర్మాలను ప్రేమించే నాకు ఆ అవసరం లేదు. ధర్మాన్ని అడ్డుపెట్టుకుని మతోన్మాదంతో కొందరు రాజకీయం చేస్తున్నారు. అలాంటి వారు నా ప్రశ్నలకు బదులివ్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను హిందూ వ్యతిరేకినని, ధర్మ విరోధినని నిందిస్తున్నారు. త్వరలో వస్తా.. నాపై నిందలు వేస్తున్న వారికి సమాధానం చెప్తా.’- ప్రకాష్రాజ్
Also Read: https://teluguprabha.net/top-stories/kcr-massive-public-meeting-in-jagtial-tomorrow/
మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవారే తనను ‘హిందూ వ్యతిరేకి’గా ముద్ర వేస్తున్నారని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. తనపై వస్తున్న విమర్శలు, ఏడుపులు తనకు అర్థమవుతున్నాయని, తన గొంతును నొక్కేందుకే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కాగా, కేరళ సాహిత్య ఉత్సవంలో శ్రీరామలక్ష్మణులను వలస కూలీలుగా పోలుస్తూ ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఆయనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ప్రకాష్ రాజ్పై క్రిమినల్ కేసులు, పరువు నష్టం దావా వేశారు.

