JDU Party Candidate arrest: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హింస చెలరేగిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్చంద్ యాదవ్ హత్య కేసులో.. అధికార జేడీయూ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
జన్సురాజ్ మద్దతుదారు హత్య కేసు బీహార్ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడైన ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్చంద్ యాదవ్ ఇటీవల హత్యకు గురైయ్యాడు. ఈ హత్య రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో పాట్నా జిల్లాలోని మొకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అనంత్ సింగ్పై అనుమానంతో పోలీసులు నిఘా ఉంచారు. ఆదివారం తెల్లవారుజామున బార్హ్లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. అనంతరం అతడిని పాట్నాకు తరలించారు. ఈ హత్యతో సంబంధం ఉందనే అనుమానంతో అనంత్ సింగ్ అనుచరులు మణికాంత్ ఠాకూర్, రంజీత్ రామ్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే: జన్సురాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి మొకామా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తుండగా జేడీయూ, జన్సురాజ్ పార్టీల మద్దతుదారుల మధ్య ఘర్షణ చెలరేగింది. అదే సమయంలో దుండగులు దులార్చంద్ యాదవ్పై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం దులార్చంద్కు బుల్లెట్ గాయం అయినప్పటికీ.. తీవ్ర షాక్ కారణంగా మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. హత్య నేపథ్యంలో ఆగ్రహించిన దులార్చంద్ మద్దతుదారులు ఆర్జేడీ మొకామా అభ్యర్థి వీణా దేవీ కారుపై రాళ్లు రువ్వడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
Also Read:https://teluguprabha.net/national-news/nitish-kumar-bihar-elections-video-message/
ఎన్నికల సంఘం చర్యలు: ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన ఎన్నికల సంఘం డీజీపీని వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అల్లర్ల నివారణలో విఫలమైనందుకు కారణంపై కఠిన చర్యలు తీసుకుంది. పాట్నా రూరల్ ఎస్పీ విక్రమ్ సిహాగ్ను తక్షణమే బదిలీ చేయాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ను ఆదేశించింది. బాఢ్-2 ఎస్డీపీవో అభిషేక్ సింగ్పై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. మొకామా రిటర్నింగ్ అధికారి, బాఢ్ ఎస్డీవో చందన్ కుమార్, బాఢ్-1 ఎస్డీపీవో రాకేశ్ కుమార్, బాఢ్-2 ఎస్డీపీవో అభిషేక్ సింగ్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మొకామా నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.


