Prayagraj Murder:ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ హత్యకేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మూఢనమ్మకాలతో మనవడిని బలి ఇచ్చిన ఘటనలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన ఓ తాంత్రికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సలహా కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో స్పష్టమైంది.
ఇంటికి పిలిచి ప్రాణాలు..
వివరాల్లోకి వెళ్తే ఆగస్టు 26న పీయూష్ సింగ్ అలియాస్ యశ్ అనే 11వ తరగతి విద్యార్థి హత్యకు గురయ్యాడు. కాలేజీకి వెళ్తున్న సమయంలో అతడి తాత సరణ్ సింగ్ ఇంటికి పిలిచి ప్రాణాలు తీశాడు. కేవలం అంతటితో ఆగక, మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఈ ఘోర సంఘటన స్థానికంగా భయాందోళనలకు కారణమైంది.
హత్య వెనుక మరొకరి..
ఈ కేసులో తొలుత పోలీసులు సరణ్ సింగ్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ, ఈ హత్య వెనుక మరొకరి ప్రమేయం ఉందని స్పష్టమైంది. పోలీసులు లోతుగా విచారించగా కౌశాంబీ జిల్లాకు చెందిన 45 ఏళ్ల మున్నాలాల్ అనే తాంత్రికుడి పాత్ర బయటపడింది.
వరుస ఆత్మహత్యలు..
పోలీసుల ప్రకారం, సరణ్ సింగ్ కుటుంబంలో వరుస ఆత్మహత్యలు చోటుచేసుకోవడంతో ఆయన మానసికంగా కుంగిపోయాడు. ఈ పరిస్థితిని మున్నాలాల్ ఉపయోగించుకున్నాడు. ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని నమ్మించి, వాటిని పారిపోయేలా చేయాలంటే మనవడిని బలి ఇవ్వాలని సూచించాడు. అంతేకాకుండా, బలి అనంతరం మృతదేహాన్ని తొమ్మిది ముక్కలు చేసి వేర్వేరు దిశల్లో పడేయాలని కూడా ఆదేశించాడు.
తాంత్రికుడి మాటలను నమ్మిన సరణ్ సింగ్ ఆ సూచనలను అమలు చేశాడు. అతని మూఢనమ్మకం కారణంగా సొంత మనవడు పీయూష్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు మున్నాలాల్ కదలికలపై నిఘా పెట్టి ఆదివారం సాయంత్రం కరేలీ లేబర్ చౌరాహా వద్ద అతడిని పట్టుకున్నారు. విచారణలో తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. సరణ్ సింగ్తో తాను కలసి ఈ హత్యకు పరోక్ష కారణమని ఒప్పుకున్నాడు.


