Saturday, November 15, 2025
Homeనేషనల్Rahul Gandhi : 'గుజరాత్ మోడల్' కాదు 'ఓటుచోరీ' అడ్డా.. బీజేపీపై రాహుల్​ నిప్పులు!

Rahul Gandhi : ‘గుజరాత్ మోడల్’ కాదు ‘ఓటుచోరీ’ అడ్డా.. బీజేపీపై రాహుల్​ నిప్పులు!

Rahul Gandhi criticizes Gujarat Model : గుజరాత్ మోడల్… దేశ ప్రగతికి దర్పణం అని బీజేపీ పదేపదే చెబుతున్న వేళ, అదే మోడల్‌పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అది ఆర్థిక ప్రగతికి నమూనా కాదని, అదో ‘ఓటుచోరీ మోడల్’ అని ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బిహార్ వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో కలిసి ఆయన చేసిన ఈ విమర్శలు రాజకీయ దుమారం రేపాయి. అసలు బీజేపీపై రాహుల్, స్టాలిన్ ఇంత తీవ్రస్థాయిలో విరుచుకుపడటానికి కారణమేంటి? వారి ఆరోపణల వెనుక ఉన్న వ్యూహమేమిటి?

- Advertisement -

‘ఓటరు అధికార్ యాత్ర’లో ఫైర్: బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో నిర్వహించిన ‘ఓటరు అధికార్ యాత్ర’లో రాహుల్ గాంధీ, ఎంకే స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ గాంధీ, బీజేపీపై, వారి గుజరాత్ మోడల్‌పై నిప్పులు చెరిగారు. “మీరు గుజరాత్ మోడల్ గురించి మాట్లాడుతున్నారు. అది ఆర్థిక నమూనా కాదు, అది ఓట్ల దొంగతనం నమూనా. బీజేపీ ఓట్లను దొంగిలించే ప్రక్రియను గుజరాత్ నుంచే ప్రారంభించింది,” అని రాహుల్ తీవ్రంగా విమర్శించారు.

ఉగ్రవాదం కన్నా ప్రమాదకరం: స్టాలిన్ : రాహుల్ గాంధీకి మద్దతుగా, అదే వేదికపై నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “భారతీయ జనతా పార్టీ ఎన్నికల వ్యవస్థనే అపహాస్యం చేసింది. ప్రజాస్వామ్యానికి ఓటు వెన్నెముక లాంటిది. అలాంటి ఓట్లను దొంగతనం చేయడం ఉగ్రవాదం కన్నా అత్యంత ప్రమాదకరమైనది,” అని స్టాలిన్ మండిపడ్డారు. తమ ఓట్లను దొంగిలించిన ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రజలే గద్దె దించుతారని ఆయన జోస్యం చెప్పారు.

ఒకే గొంతుకతో విపక్షాలు: ‘ఓటరు అధికార్ యాత్ర’ ద్వారా విపక్ష నేతలు ఓటర్ల హక్కుల పరిరక్షణ అనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఎన్నికల ప్రక్రియను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని వారు ఆరోపిస్తున్నారు. రాహుల్, స్టాలిన్ వంటి ఇద్దరు కీలక నేతలు ఒకే వేదికపై నుంచి బీజేపీపై దాడి చేయడం, విపక్షాల ఐక్యతను ప్రదర్శించడంతో పాటు, రాబోయే రోజుల్లో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయనడానికి సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad