Sunday, November 16, 2025
Homeనేషనల్Rahul Gandhi : పార్లమెంటులో... గొంతు నొక్కుతున్నారంటూ గళమెత్తిన రాహుల్!

Rahul Gandhi : పార్లమెంటులో… గొంతు నొక్కుతున్నారంటూ గళమెత్తిన రాహుల్!

Rahul Gandhi alleges being silenced in Parliament : చట్టసభల సాక్షిగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటులో తమ గొంతు నొక్కుతున్నారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రక్షణ మంత్రికి ఇచ్చిన అవకాశాన్ని తనకు ఎందుకు నిరాకరించారని నిలదీశారు. దీనికి అధికారపక్షం కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. పార్లమెంటును వ్యక్తిగత “డ్రాయింగ్ రూమ్”గా భావించవద్దంటూ చురకలంటించింది. 

- Advertisement -

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేతగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. సభ వాయిదా పడిన అనంతరం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష నేత ఆరోపణ ఇదే: “సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మాట్లాడేందుకు అనుమతించారు. కానీ, ప్రతిపక్ష నాయకుడినైన నన్ను, ఇతర సభ్యులను మాట్లాడనివ్వలేదు. ఇది పార్లమెంటులో ఒక కొత్త తరహా పద్ధతి. ప్రభుత్వ పక్షం మాట్లాడినప్పుడు, ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వడం సభా సంప్రదాయం. కానీ ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కుతున్నారు” అని రాహుల్ గాంధీ విమర్శించారు. అంతకుముందు, ఏ అంశంపైన అయినా చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలో ప్రకటించారు.

విరుచుకుపడ్డ అధికార పక్షం: రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు.

ధర్మేంద్ర ప్రధాన్: “పార్లమెంటుకు కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయి. దానిని ఎవరూ ‘వ్యక్తిగత డ్రాయింగ్ రూమ్’గా భావించకూడదు. ప్రతి ఒక్కరూ సభా నిబంధనలను పాటించాల్సిందే. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ చర్చల నుంచి పారిపోతున్నారు. వారు పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంలో ఆసక్తి చూపుతూ, పార్లమెంటులో బాధ్యతాయుతంగా మాట్లాడటానికి ఇష్టపడటం లేదు” అని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.

కిరణ్ రిజిజు: “మధ్యాహ్నం 2:30 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ఉంది. అక్కడ అన్ని విషయాలు చర్చించుకోవచ్చు. కానీ సమావేశాల తొలిరోజే విపక్షాలు నిరసనలకు దిగడం సరైన పద్ధతి కాదు” అని ఆయన హితవు పలికారు.

ఇండియా’ కూటమి వ్యూహం.. ప్రియాంక మద్దతు: ఈ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన పహల్గాం ఉగ్రదాడి, బిహార్ ఓటర్ల జాబితా, ‘ఆపరేషన్ సిందూర్’ వంటి ఎనిమిది కీలక అంశాలను కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీలు గుర్తించాయి. ఈ అంశాలపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు, ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతున్నప్పుడు, ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రశ్నిస్తూ తన సోదరుడు రాహుల్‌కు మద్దతుగా నిలిచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad