IAS Officer Accuses IAS Husband of Domestic Violence: రాజస్థాన్లో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య వివాదం సంచలనం రేపుతోంది. తన భర్త, ఐఏఎస్ అధికారి ఆశీష్ మోదీ, తనపై దారుణంగా గృహ హింసకు పాల్పడుతున్నాడని, శారీరకంగా దాడి చేసి, చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఐఏఎస్ అధికారిణి భారతీ దీక్షిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ 2014 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ అధికారులు కావడం గమనార్హం.
ALSO READ: Encounter: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత.. ఆరుగురు మావోయిస్టుల హతం
భారతీ దీక్షిత్ ప్రస్తుతం ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా, ఆశీష్ మోదీ సాంఘిక న్యాయ శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
నవంబర్ 7న జైపూర్లోని SMS హాస్పిటల్ పోలీస్ స్టేషన్లో దీక్షిత్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె చేసిన ఆరోపణలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. “2014లో నా తండ్రి క్యాన్సర్తో పోరాడుతున్న సమయంలో, నా బలహీనతను ఆసరాగా చేసుకుని ఆశీష్ మోదీ నన్ను పెళ్లికి బలవంతం చేశాడు. ఆ తర్వాత నిరంతరం శారీరక, మానసిక వేధింపులకు గురిచేశాడు,” అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
మోదీ తరచుగా మద్యం సేవించి, నేరస్థులతో సంబంధాలు పెట్టుకుని, ప్రశ్నిస్తే తనపై దాడి చేసేవాడని ఆమె ఆరోపించారు. 2018లో తమకు కుమార్తె పుట్టిన తర్వాత ఈ హింస మరింత పెరిగిందని, వేధింపులు భరించలేక కొంతకాలం జైపూర్ వదిలి వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.
కిడ్నాప్, గన్పాయింట్తో బెదిరింపులు:
గత అక్టోబర్లో, మోదీ, అతని అనుచరుడు ఒకరు తనను ప్రభుత్వ వాహనంలో కిడ్నాప్ చేశారని, గంటల తరబడి నిర్బంధించారని భారతీ దీక్షిత్ సంచలన ఆరోపణలు చేశారు. విడాకులకు అంగీకరించకపోతే తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని ‘గన్పాయింట్’తో బెదిరించినట్లు తెలిపారు.
అంతేకాదు, మోదీ తన గదిలో రహస్యంగా స్పై కెమెరాను అమర్చారని, తన మొబైల్ ఫోన్ను ఇతర పరికరాలకు కనెక్ట్ చేసి, రహస్య ప్రభుత్వ పత్రాలను కూడా యాక్సెస్ చేశారని ఆమె ఆరోపించారు. ఈ నేరాలకు సురేంద్ర విష్ణోయ్, ఆశిష్ శర్మ అనే ఇద్దరు వ్యక్తులు మోదీకి సహకరించారని ఆమె పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై మోదీ స్పందిస్తూ, విచారణకు పూర్తిగా సహకరిస్తానని, అయితే ఎఫ్ఐఆర్ నమోదైన సమయంలో తాను బీహార్లో ఉన్నానని తెలిపారు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. తనకు, తన కుటుంబానికి తక్షణమే రక్షణ కల్పించాలని భారతీ దీక్షిత్ పోలీసులను అభ్యర్థించారు.


