Shilpa Shetty Case:
బాలీవుడ్ స్టార్ శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్కుంద్రాపై రూ.60 కోట్లు మోసం చేశారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో దంపతులపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ దేశం విడిచి వెళ్లొద్దని నోటీసుల్లో హెచ్చరించారు. ఈ కేసులో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ రాజ్కుంద్రాను బుధవారం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఆయన సెప్టెంబర్ 15 దాకా సమయం ఇవ్వాలని కోరడంతో అధికారులు గడువు పెంచారు.
ఈనేపథ్యంలో అసలు రూ.60 కోట్ల చీటింగ్ కేసుపై మరోసారి చర్చ మొదలైంది.
కేసు వివరాల్లోకి వెళ్తే..ముంబైలోని జుహుకి చెందిన దీపక్ కొఠారి అనే 60 ఏళ్ల వ్యక్తి శిల్పాశెట్టి దంపతులకు చెందిన బెస్ట్ డీల్ అనే ఆన్లైన్ రిటైల్ షాపింగ్ ప్లాట్ఫాం బిజినెస్లో పెట్టుబడి పెట్టేందుకు రూ.60 కోట్లు విడతల వారీగా చెల్లించారు. కొఠారి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అయిన లోటస్ కాపిటల్ ఫైనాన్స్ సర్వీసెస్కు డైరెక్టర్గా కొనసాగుతున్నారు. కొఠారి కంప్లయింట్ ప్రకారం..
ఈ నేపథ్యంలో రాజేశ్ ఆర్యా వ్యక్తి ద్వారా శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు కొఠారికి పరిచయం అయ్యారు. ట్యాక్సులు చెల్లించే పని లేకుండా తమ బిజినెస్ విస్తరించడానికి రూ.70 కోట్లు రుణం కావాలని కొఠారిని కోరారు. దీనికి తీసుకున్న రుణం చెల్లించడంతోపాటు తమ బిజినెస్ లాభాల్లో వాటా ఇస్తామని దంపతులు హామీ ఇచ్చారు. దీంతో కొఠారి 2015 ఏప్రిల్లో రూ.31.9 కోట్లు, అదే సంవత్సరం సెప్టెంబర్లో రూ. 28.53 కోట్లు చెల్లించాడు. ఏప్రిల్ 2016 కల్లా తీసుకున్న రుణం తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ 2016 సెప్టెంబర్లో బెస్ట్ డీల్ డైరెక్టర్గా శిల్పాశెట్టి వైదొలిగారు. అయితే ఆ బిజినెస్ నష్టాల్లో ఉందని కొఠారి 2017లో గుర్తించారు. తానిచ్చిన డబ్బులు వ్యాపారాన్ని విస్తరించడానికి కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం శిల్పాశెట్టి దంపతులు ఖర్చు పెట్టినట్లు గుర్తించారు.
కాగా, కొఠారి ఆరోపణలను శిల్పాశెట్టి దంపతుల లాయర్ ఖండిస్తున్నారు. ఇది సివిల్ మ్యాటర్ అని చెబుతున్నారు. సంస్థ ఆర్థికంగా నష్టాలను చవిచూసిందే, ఈ విషయం కోర్టులో పరిష్కరం అయ్యిందని అంటున్నారు. ఈ కేసులో బాలీవుడ్ నటి దంపతులు ఎలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడలేదని, సంబంధిత ట్రైబ్యునళ్లు, కోర్టులకు అవసరమైన డాక్యుమెంట్లను టైం టు టైం సమర్పించామని చెప్పారు.
అయితే 2015 నుంచి 2023 మధ్యకాలంలో మొత్తం రూ.60.48కోట్లు పెట్టుబడిగా పెట్టానని, బిజినెస్ విస్తరణ కోసం తీసుకున్న డబ్బును తమ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారని కొఠారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదైంది.


