Mumbai Rains: ముంబైలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈరోజు చెట్టు కూలి మీద పడటంతో 63 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రేపటి వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, ముంబైలో వర్షాలకు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాదాపు 4 ఇండిగో విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ముంబై ఎయిర్పోర్ట్కు వచ్చే 13 విమానాలను దారి మళ్లింపు చేశారు.
ప్రతికూల వాతావరణం, తక్కువ విజిబిలిటీ కారణంగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వే కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాల ధాటికి నగరంలో సాధారణ జనజీవనం, ప్రయాణ సౌకర్యాలు తీవ్రంగా స్తంభించిపోయాయి. ఆదివారం ఉదయం తీవ్రమైన గాలులు భారీ వర్షాల కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేను దాదాపు 60 నిమిషాల పాటు తాత్కాలికంగా మూసివేసి, ఆ తర్వాత పునరుద్ధరించారు.
ఈమేరకు ప్రతికూల వాతావరణం వల్ల విమానాల షెడ్యూల్స్ మారాయని, ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు బయలుదేరే ముందు తమ ఇండిగో ఫ్లైట్ స్టేటస్ తనిఖీ చేసుకోవాలని సూచించింది. వర్షాల కారణంగా ముంబైకి రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
రైలు పట్టాలపై నీరు చేరడంతో పలు రైళ్ల సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ మళ్లంపు చేపట్టారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ముంబైలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. సముద్రంలో సుమారు 4.19 మీటర్ల ఎత్తులో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

