Saturday, November 15, 2025
Homeనేషనల్Kiren Rijiju on Rahul Gandhi : 'ఇందిరమ్మ కూడా ఇలా చేయలేదు' -...

Kiren Rijiju on Rahul Gandhi : ‘ఇందిరమ్మ కూడా ఇలా చేయలేదు’ – రాహుల్ పై రిజిజు నిప్పులు!

Kiren Rijiju on Rahul Gandhi’s Colombia speech : విదేశీ గడ్డపై భారత ప్రతిష్టను దిగజార్చేలా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఏ ప్రతిపక్ష నేత చేయని విధంగా రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, ఇది దేశ ప్రతిష్టకు భంగం కలిగించే చర్య అని ఆయన మండిపడ్డారు. సొంత నాయకురాలు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తుచేశారు. ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారు? దానికి రిజిజు ఎందుకంత తీవ్రంగా స్పందించారు…? ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు, అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందో చూద్దాం.

- Advertisement -

విదేశీ గడ్డపై రాహుల్ వ్యాఖ్యలు… స్వదేశంలో రాజకీయ దుమారం : ఇటీవల కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో బహుళ మతాలు, కులాలు, సంప్రదాయాలు కలవు. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తుంది. అయితే, ఈ వ్యవస్థ ప్రస్తుతం ముప్పేట దాడికి లోనవుతున్నందుకు ఆందోళన వ్యక్తమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, భారత ఆర్థిక వ్యవస్థ సేవల రంగంపై ఆధారపడి ఉందని, దీనివల్ల ఆశించిన స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగడం లేదని విశ్లేషించారు.

రిజిజు ప్రత్యారోపణలు… ఇందిరాతో పోలిక : రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడటం బాధ్యతారాహిత్యం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా ఎన్నికల్లో ఓడిన తర్వాత ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు, కానీ ఆమె ఎప్పుడూ విదేశీ గడ్డపై భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని  గుర్తుచేశారు. ఎల్.కె. అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, సుష్మా స్వరాజ్, శరద్ పవార్ వంటి ఎందరో ప్రతిపక్ష నేతలు ఉన్నారని, వారెవరూ ఇలా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని ఆయన ఉద్ఘాటించారు.

ప్రపంచ యవనికపై భారత్ పాత్రపై భిన్నాభిప్రాయాలు : “ప్రపంచాన్ని భారత్ నడిపించలేదు” అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను రిజిజు తీవ్రంగా ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అనేక రంగాల్లో దూసుకుపోతోందని, ప్రపంచ యవనికపై తనదైన ముద్ర వేస్తోందని అన్నారు. విదేశాల్లోని ప్రజలు భారతీయులందరూ రాహుల్ గాంధీలాగే ఆలోచిస్తారని అనుకుంటే దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

భావ ప్రకటనా స్వేచ్ఛపై రిజిజు విమర్శలు : భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొందరు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని రిజిజు ఆరోపించారు. “జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలను భారత్  నుంచి వేరు చేయాలని కోరుకోవడమేనా భావ ప్రకటనా స్వేచ్ఛ? మావోయిస్టులకు మద్దతుగా, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దేశాన్ని విభజించాలని మాట్లాడటం సరికాదు” అని ఆయన హితవు పలికారు.

ఈ వివాదంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad