Robbery in Chhattisgarh Congress office: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కార్యాలయంలో ఏర్పాటు చేసిన డజన్ల కొద్ది స్టీల్ ట్యాప్లు చోరీకి గురయ్యాయి. అయితే, దొంగతనానికి పాల్పడిన వారు నోట్ రాసిమరీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. సుర్గుజా జిల్లాలోని అంబికాపుర్లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దొంగలు దాదాపు 73 ట్యాప్లు ఎత్తుకెళ్లారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఇదే క్రమంలో చోరీ చేసిన వారు నేలపై ఉన్న దుమ్ము మీద ‘లవ్ యూ’ అని రాసి వెళ్లినట్లు తెలిపారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి..
డ్రగ్స్కు బానిసైన వారు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలకృష్ణ పాఠక్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కార్యాలయంలో దొంగతనం జరగడం ఇది మొదటిసారేమీ కాదని, ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారని తెలిపారు. కాంగ్రెస్ కార్యాలయంలో దొంగలు నోట్ రాసిమరీ వెళ్లారంటే.. రాష్ట్రంలోని బీజేపీ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని స్పష్టమవుతోందన్నారు. ఈ సందర్భంగా పోలీసుల పనితీరును ఆయన పశ్నించారు. పార్టీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అంబికాపుర్ పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇప్పుడీ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దొంగలు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో దొంగతనం చేయడమే కాకుండా.. లవ్ యూ అని రాయడం పట్ల నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

