Sabarimala Gold Case VSSS Report: కర్ర విరగలేదు.. పాము చచ్చింది అన్న చందంగా శబరిమల బంగారం చోరీ ఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. గర్భగుడి తలుపులను ఏ మాత్రం మార్చకుండా.. రాగి రేకులపై ఉన్న బంగారం పొరను చాలా చాకచక్యంగా మాయం చేశారు. ఈ మేరకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు సమర్పించిన నివేదికలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల బంగారం మాయం కేసులో కీలక శాస్త్రీయ ఆధారాలు వెలుగుచూశాయి. ఈ మేరకు కేరళ హైకోర్టుకి దర్యాప్తు బృందం నివేదిక సమర్పించింది. త్వరలో తుది నివేదిక రానుంది. శబరిమల గర్భగుడి స్వర్ణ బంధనం చోరీ కేసులో వీఎస్ఎస్ఎస్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఆలయ గర్భగుడి తలుపులను ఏ మాత్రం మార్చలేదని.. వాటిపై ఉన్న రాగి రేకుల మీద నుంచి బంగారు పొరను మాత్రమే రసాయనాల సాయంతో నేర్పుగా దోచుకున్నారని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు సమర్పించిన నివేదికను, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు హైకోర్టుకు సమర్పించారు.
Also Read: https://teluguprabha.net/national-news/captain-shambhavi-pathak-died-in-plane-crash/
గర్భగుడి తలుపుల చెక్క ఫ్రేమ్వర్క్ కూడా పాతదేనని శాస్త్రవేత్తల పరిశోధనలో నిర్ధారణైంది. అయితే చోరీకి గురైంది ఘనమైన బంగారం కాదని, రాగి రేకులపై ఉన్న బంగారు పొర మాత్రమేనని తేలింది. కొన్ని రేకులపై బంగారం శాతం గణనీయంగా తగ్గింది. దీనిని కెమికల్స్ ఉపయోగించి బంగారాన్ని వేరు చేసి ఉంటారని శాస్త్రవేత్తలు అంచనాకి వచ్చారు. రేకులపై కనిపించిన మార్పుల వల్ల వాటిని పూర్తిగా మార్చేసి ఉంటారని ఇప్పటివరకు ఊహాగానాలు వ్యాపించగా వాటికి శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. బంగారం వెలికితీతకు ఉపయోగించే పాదరసం వంటి రసాయనాల ప్రయోగం వల్లే వాటి ఉపరితలంలో మార్పులు వచ్చాయని తేలింది. భౌతికంగా వాటిని మార్చలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి తుది నివేదికను త్వరలోనే సమర్పిస్తామని శాస్త్రవేత్తలు సిట్కు తెలిపారు. మరిన్ని విశ్లేషణలు కొనసాగుతున్నాయన్నారు. పాత గర్భగుడి తలుపుల నమూనాలతో పోల్చాలని వెల్లడించారు. తాజా రిపోర్టుతో ఈ నేరం వెనుక ఉన్నదెవరు అనే కోణంలో విచారణ నిర్వహించనున్నారు.

