Scientists Discover 13 New Amphibian Species in Northeast India: ప్రకృతి ప్రేమికులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. పచ్చని అడవులకు, అంతరించిపోతున్న అరుదైన జీవజాతులకు నెలవైన ఈశాన్య భారతం (Northeast India) మరోసారి వార్తల్లో నిలిచింది. డెహ్రాడూన్లోని Wildlife Institute of India (WII) కు చెందిన పరిశోధకులు ఐదేళ్ల పాటు సాగించిన సుదీర్ఘ అన్వేషణ ఫలించింది. వారు ఆ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఏకంగా 13 కొత్త రకం ఉభయచర జాతుల (New Amphibian Species)ను కనుగొన్నారు. భారతీయ జీవవైవిధ్య చరిత్రలో ఇదొక కీలక మలుపుగా నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: PM Modi in Goa : గోవా గడ్డపై శ్రీరామ వైభవం: ప్రధాని మోదీ చేతుల మీదుగా భారీ విగ్రహావిష్కరణ!
ఎక్కడెక్కడ దొరికాయంటే?
ఈశాన్య రాష్ట్రాలన్నీ జీవవైవిధ్యానికి హాట్స్పాట్లు. ఈ 13 కొత్త జాతుల్లో అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్ అటవీ ప్రాంతాల్లోనే ఆరు రకాలను గుర్తించారు. మేఘాలయలో మూడు జాతులు, అస్సాం, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున బయటపడ్డాయి. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ, మేఘాలయ బయోడైవర్సిటీ బోర్డు సహకారంతో 2019 నుంచి 2024 వరకు ఈ పరిశోధన సాగింది.
శాస్త్రీయ విశేషాలు
ఈ కొత్త కప్పలన్నీ ‘రావోర్చెస్టెస్’ (Raorchestes) అనే ప్రజాతికి చెందినవి. ఇవి సాధారణంగా పొదల్లో నివసిస్తాయి కాబట్టి వీటిని ‘బుష్ ఫ్రాగ్స్’ అని పిలుస్తారు. వీటికి నామకరణం చేసేటప్పుడు ఆయా ప్రాంతాల పేర్లనే పెట్టడం విశేషం. ఉదాహరణకు:
-
మిజోరాంలో దొరికిన దానికి R lawngtalaiensis
-
అస్సాం బరాక్ లోయలో దొరికిన దానికి R barakensis
-
నాగాలాండ్ ఖోనోమాలో దొరికిన దానికి R khonoma
-
మణిపూర్లో దొరికిన దానికి R monolithus అని పేర్లు పెట్టారు.
అరుణాచల్ ప్రదేశ్లో గుర్తించిన వాటికి R eaglenestensis, R magnus వంటి పేర్లు నిర్ణయించారు.
‘టిక్-టిక్’ కప్పల రహస్యం
ఈ చిన్న కప్పలు “టిక్-టిక్” అనే ఒక విచిత్రమైన శబ్దం చేస్తాయి. దట్టమైన అడవుల్లో ఈ శబ్దాలను బట్టి వాటిని గుర్తించడం చాలా కష్టమైన పని. డబ్ల్యూఐఐ (WII) పీహెచ్డీ స్కాలర్ బితుపన్ బారువా నేతృత్వంలోని బృందం, లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలతో కలిసి ఈ ఘనత సాధించింది. వీటిని కచ్చితంగా గుర్తించేందుకు కేవలం కంటి చూపునే కాకుండా, వాటి అరుపులు (Acoustics), జన్యువులు (Genetics), శారీరక ఆకృతిని (Morphology) క్షుణ్ణంగా విశ్లేషించారు. అంతేకాదు, విదేశీ మ్యూజియంలలో భద్రపరిచిన వందేళ్ల నాటి ఇండియా-బర్మా ప్రాంతపు నమూనాలను కూడా వారు పరిశీలించారు.
పెరిగిన జాతుల సంఖ్య
ఈ తాజా ఆవిష్కరణతో భారతదేశంలో అధికారికంగా నమోదైన బుష్ ఫ్రాగ్ జాతుల సంఖ్య 82 నుంచి 95కి పెరిగింది. ఎనిమిది రాష్ట్రాల్లోని 81 ప్రాంతాల్లో, అందులోనూ 25 రక్షిత అటవీ ప్రాంతాల్లో ఈ శాంపిల్స్ సేకరించారు. ఈ వివరాలన్నీ ప్రముఖ సైన్స్ జర్నల్ ‘వెర్టిబ్రేట్ జువాలజీ’ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. మన దేశంలో ఇంకా బయటపడని జీవజాలం ఎంతో ఉందనడానికి ఈ పరిశోధనే నిదర్శనం.
ALSO READ: Sericulture : ఆకులో అదృష్టం.. ఆముదంతో పట్టుబట్ట! రైతుకు రెట్టింపు ఆదాయం ఖాయం!

