Sensational decision of the Center that UGC, AICT, NCTE abolished: దేశంలో ప్రైవేటు విద్యాసంస్థల నియంత్రణ, నిరంతర పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు విద్యా నియంత్రణా సంస్థలను రద్ధు చేసి ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రస్తుతం విడివిడిగా ఉన్న యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు ముమ్మర చర్యలు చేపట్టింది. ఇందు కోసమే రూపొందించిన వికసిత్ భారత్ శిక్షా అధీక్షణ్ బిల్లుకు శుక్రవారం కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది.
ఒకే గొడుగు కిందకు మూడు సంస్థలు..
దేశంలో ఉన్నత విద్యా సంస్థల నియంత్రణ కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) పనిచేస్తున్నాయి. 1956లో యూజీసీ, 1945లో ఏఐసీటీఈ, 1995లో ఎన్సీటీఈలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ మూడు సంస్థలు లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా వైఫల్యం చెందడంతో పాటు సమన్వయం లేకుండా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే వీటిని ఒకే నియంత్రణ కిందకు తీసుకొచ్చింది. దానికి వికసిత భారత్ శిక్షా అధీక్షణ్ అని పేరు పెట్టింది. అయితే, ఇందులో వైద్య విద్య, న్యాయ విద్య కోసం పని చేస్తున్న సంస్థలను మాత్రం మినహాయించారు.
మూడు బాధ్యతలతో వికసిత భారత్ శిక్షా అధీక్షణ్
ఈ కొత్త వ్యవస్థకు ప్రధానంగా మూడు బాధ్యతలను అప్పగించనున్నారు. అవే రెగ్యులేషన్, అక్రెడిటేషన్, ప్రమాణాలను నిర్దేశించడం. కానీ, ఈ వ్యవస్థకు విద్యా సంస్థలకు నిధులు కేటాయించే అధికారం మాత్రం ఉండదని తెలుస్తోంది. మొత్తం బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఈ కొత్త వికసిత భారత్ శిక్షా అధీక్షణ్ ఇక మీదట నుంచి నియంత్రణతో పాటు గుర్తింపు ఇచ్చే అధికారాలను కలిగి ఉండడంతో పాటు వృత్తి పరమైన నైపుణ్యాన్ని పెంపొందించనున్నాయి. 2018లోనే యూజీసీ యాక్ట్ను రద్ధు చేసి సెంట్రల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, అప్పట్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను రద్దు చేసుకున్నారు. 2021లో కేంద్ర విద్యా శాఖ మంత్రిగా దర్మేంధ్ర ప్రధాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దీన్ని మళ్ళీ తెర మీదకు తీసుకువచ్చారు. ఇప్పుడు మళ్ళీ దాన్నే కాస్త మార్చి వికసిత్ భారత్ శిక్షా అధిక్షన్ బిల్లుగా మార్పు చేసి కేంద్ర మంత్రి మండలి ముందు పెట్టారు. నకిలీని తగ్గించడానికి, జవాబుదారీతనాన్ని కొనసాగిస్తూ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి విధుల నియంత్రణ, అక్రిడిటేషన్, విద్యా ప్రమాణాలు, నిధుల విభజన సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంట్లో ఆమోదం పొందితే చట్టంగా మారి అమల్లోకి రానుంది.

