దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర విషాదం చోటు చేసుకుంది. లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు జారిపడ్డారు. ఈ దుర్ఘటనలో(Mumbai Train Accident) ఐదుగురు మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి థానే జిల్లాలోని కసార ప్రాంతానికి లోకల్ ట్రైన్ వెళ్తుంది. ఈ రైలులో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. దీంతో ఫుట్ బోర్డ్ మీద వేలాడుతూ కొందరు ప్రయాణిస్తున్నారు.
ఈ క్రమంలో ఒక్కసారిగా కొంతమంది పట్టును కోల్పోయి ప్రయాణికులు జారి పట్టాలపై పడ్డారు. ఆ సమయంలో రైలు వేగం అధికంగా ఉండటంతో ఐదుగురు స్పాట్ లోనే మరణించగా.. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కాగా ముంబైలో విపరీతమైన రద్దీతో లోకల్ ట్రైన్లో ప్రయాణికులు ఫుట్ బోర్డింగ్లో ప్రయాణించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఈ ట్రైన్లు ఎప్పుడూ చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు లోకల్ ట్రైన్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఈ పోటీ ప్రపంచంలో ఫుట్ బోర్డు మీద వేలాడుతూ ప్రయాణించడం ప్రమాదం అని తెలిసినా గతి లేని పరిస్థితుల్లో అలాగే ప్రయాణిస్తూ ఉంటారు. ఛార్జీలు తక్కువగా ఉండంటతో పాటు గమ్యస్థానానికి త్వరగా చేరుకోవచ్చనే ఉద్దేశంతో లోకల్ ట్రైన్లలో ప్రయాణానికి అక్కడి ప్రజలు మొగ్గు చూపుతారు.