Shubhanshu Shukla reaches Space: 28 గంటల సుదీర్ఘ వ్యోమనౌక ప్రయాణం తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి శుభాంశు శుక్లా బృందం అడుగుపెట్టింది. యాక్సియమ్-4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోధనా కేంద్రంలోకి చేరుకున్నారు. నేటి నుంచి రెండు వారాల పాటు (14 రోజులు) ఈ బృందం పరిశోధనలు చేయనుంది. నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రోగ్రామ్ విజయవంతం అయినట్లు ఆ సంస్థలు ప్రకటించాయి.
ఆయనతో పాటు మరో నలుగురు సభ్యులు ఈ అంతరిక్ష ప్రయాణంలో భాగం అయ్యారు. శుభాంశు శుక్లాపై ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. పలు వాయిదాల తర్వాత ఈ మిషన్ విజయవంతం అయ్యింది. స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లింది. ఆ తర్వాత యాగ్జియం–4 క్యాప్సూల్ రాకెట్ నుంచి వేరు అయ్యింది. ఈ ఘటన కేవలం 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ ఎగువ కక్ష్యలోకి టార్గెట్లోకి ప్రవేశించింది. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా శుభాంశు నిలిచారు. అంతకంటే ముందు 41 ఏళ్ల క్రితం రాకేశ్ శర్మ అంతరిక్షంలో కాలు మోపారు.
శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు సహచర వ్యోమగాములు మిషన్ కమాండర్ నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్, స్పెషలిస్టులు స్లవోస్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టైబర్ కపు (హంగరీ)లు అందులో ఉన్నారు.
వీరు రెండు వారాలకు సరిపడా ఆహారాన్ని సైతం వెంట తీసుకెళ్లారు. ఇక శుభాంశు మాత్రం దేశీ ఫుడ్తో స్పేస్ స్టేషన్లో అడుగుపెట్టాడు. శుభాంశు పలు విటమిన్లతో పాటు ప్రోటీన్ పుష్కలంగా లభించే 4 దేశీ చీజ్లను తన వెంట తీసుకెళ్లారు. ఇవే కాకుండా అతని మెనూలో మామిడి జ్యూస్, పెసర పప్పు హల్వా, గజర్ హల్వా వంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. డీఆర్డీవోకు చెందిన మిలిటరీ న్యూట్రిషన్ టెక్నాలజీ విభాగం డీబీటీ ఈ ఫూడ్స్ని వ్యోమగామికి అందజేసింది.
స్పేస్ స్టేషన్లో వ్యోమగాములు స్లీపింగ్ బ్యాగ్స్లో నిద్రపోనున్నారు. తమ శరీరాలను స్లీపింగ్ బ్యాగులకు కట్టేసుకుని వారు నిద్రపోనున్నారు. ఎందుకంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అందువల్ల వాళ్లు వాటిని బంధించుకుంటారు. లేకపోతే అవి అంతరిక్షంలో తేలుతాయి.