SIR in Telugu States: తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనాభా గణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పరిగణనలోకి తీసుకుని ఈ షెడ్యూల్ను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ మూడో దశ ప్రక్రియ నిర్వహించనున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు షెడ్యూల్ను తర్వాత ప్రకటించనున్నారు.
తెలంగాణలో జూన్ 25 నుంచి జులై 24 వరకు, ఏపీలో జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓలు, బీఎల్ఏలు డోర్ టు డోర్ సందర్శించి వివరాలు సేకరించనున్నారు. ఇక తెలంగాణలో జులై 31న, ఏపీలో జులైన 21న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/uber-representatives-meet-ap-cm/
ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరినీ చేర్చడం, మరణించిన లేదా ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను, ఒకే పేరుతో ఉన్న నకిలీ ఓట్లను తొలగించి లోపాలు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయడమే ముఖ్య ఉద్దేశంగా సర్ను ఎన్నికల సంఘం తీసుకువచ్చింది. అర్హులైన ఓటర్లందరూ తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ఎన్యూమరేషన్ ఫారాలను భర్తీ చేసి ఈ మూడో దశ సవరణలో ఉత్సాహంగా పాల్గొనాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పిలుపునిచ్చారు. కాగా, ఫేజ్ 3 ప్రక్రియ కోసం 3.94 లక్షలకి పైగా బూత్ స్థాయి అధికారులను నియమించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను ఈసీ కోరింది.

