Social media post controversy: సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. భావ ప్రకటన స్వేచ్ఛను నొక్కి చెబుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ, హైకోర్టు మార్గదర్శకాల్లో తప్పేమీ లేదని తేల్చి చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త శశిధర్ గౌడ్ (నల్ల బాలు) సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఏకంగా మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీనిపై శశిధర్ గౌడ్ గతంలో హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు పోలీసు యంత్రాంగానికి పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు కేసు నమోదు చేయకూడదని తెలిపింది. అదేవిధంగా, ప్రతి చిన్న పోస్టుపై ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెట్టడాన్ని కూడా వీల్లేదని స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని తెలిపింది.
హైకోర్టు మార్గదర్శకాలపై సుప్రీంకోర్టుకు..
హైకోర్టు ఇచ్చిన ఈ మార్గదర్శకాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టు మార్గదర్శకాలు తమకు ఇబ్బందికరంగా ఉన్నాయని, వీటిని రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ.. ఈ మార్గదర్శకాలు పోలీసుల విధులకు ఆటంకంగా మారాయని తెలిపారు. అయితే, ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం హైకోర్టు తీర్పును తాము సమర్థిస్తున్నామని తీర్పు వెలువరించింది. ఇలాంటి మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేమీ లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది.

