Engineering Student Suicide Patna: బిహార్ రాజధాని పాట్నా సమీపంలోని చాంది ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రిన్సిపల్ వేధింపులే విద్యార్థిని ఆత్మహత్యకు కారణమని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కాలేజీ క్యాంపస్లో ఆందోళన చేపట్టారు. పోలీస్ వాహనాలకు నిప్పుపెట్టారు.
ముంగేర్ జిల్లాలోని బరియార్పూర్ బ్లాక్కు చెందిన 20 ఏళ్ల సోనమ్ కుమారి చాంది ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. బుధవారం రాత్రి హాస్టల్ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న విద్యార్థులు అర్ధరాత్రి వేళ క్యాంపస్లో నిరసన చేపట్టారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ గోపాల్ నందన్ స్టూడెంట్లను వేధించడంతో పాటు బెదిరిస్తున్నట్లు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
సోనమ్ కుమారి రక్తపు మడుగుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా కాలేజీ వాహనంలో ఆమెను హాస్పిటల్కు తరలించేందుకు ప్రిన్సిపల్ నిరాకరించినట్లు విద్యార్థులు ఆరోపించారు. అర్ధగంట సేపటి తర్వాత స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే సోనమ్ మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. ఇది చూసి మృతురాలి స్నేహితురాలు శిఖా కుమారి మానసికంగా కుంగిపోవడంతో ఆమెను చికిత్స కోసం పాట్నా మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు.
Also Read: https://teluguprabha.net/crime-news/police-harassment-on-victim-in-chittoor-district/
మరోవైపు స్టూడెంట్స్ నిరసనతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. డీఎస్పీ వాహనంతోపాటు స్కూటర్కు నిప్పుపెట్టారు. ప్రిన్సిపాల్ను వెంటనే రప్పించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆందోళన తీవ్రతరం కావడంతో భారీగా పోలీసులు కాలేజీ క్యాంపస్లో మోహరించారు. చివరకు గురువారం తెల్లవారుజామున పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, విద్యార్థిని మృతిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ అనంతరం ఆమె తల్లిదండ్రులతో పాటు విద్యార్థుల స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తామని.. ఆ తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.


