Sunetra Pawar As Deputy CM: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మహారాష్ట్రతో పాటు యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అజిత్ పవార్ మరణించడంతో రేపు సాయంత్రం 5 గంటలకు అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో ఎన్సీపీ నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సునేత్రా పవార్కు అత్యున్నత పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఆమెకు ఎక్సైజ్, క్రీడా మంత్రిత్వ శాఖలు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అజిత్ పవార్ వద్ద ఉండేది. అయితే, మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఆర్థిక శాఖ తాత్కాలికంగా ఫడ్నవీస్ వద్దే ఉంది. ఆ తర్వాత దీనిని ఎన్సీపీకి అప్పగించే అవకాశం ఉంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు..
రాబోయే బడ్జెట్ సమావేశానికి ముందు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 7న జరగనున్న పూణె జిల్లా పరిషత్ ఎన్నికలకు ముందు పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు సునేత్ర పవార్ను ఉపముఖ్యమంత్రిగా చేయాలని పార్టీ సీనియర్ నేతలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై పవార్ కుటుంబంలో చర్చలు జరిగాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ చర్చల అనంతరం అత్యున్నత పదవి చేపట్టడానికి సునేత్ర అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణస్వీకారం శనివారం జరిగితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం ఫడ్నవీస్ చెప్పారని ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్బల్ పేర్కొన్నారు.

