Supreme Court on ED vs Mamata Banerjee: ఇటీవల కోల్కతాలోని ఐప్యాక్ కార్యాలయంతో పాటు ఆ సంస్థ డైరెక్టర్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పోలీస్ అధికారులతో కలిసి వచ్చి పలు డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తో సహా కీలక ఫైళ్లను తీసుకెళ్లారని ఈడీ పలు ఆరోపణలు చేసింది. ఈ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
పశ్చిమబెంగాల్ రాజకీయాలు ఈడీ వర్సెస్ దీదీ అన్నట్లుగా కొనసాగుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బొగ్గు కుంభకోణం కేసు సంబంధించి ఐప్యాక్ కార్యాలయంతో పాటు డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. కాగా, సోదాలు నిర్వహిస్తుండగా సీఎం మమతా బెనర్జీ అక్కడికి వచ్చి అక్రమంగా కీలక ఫైళ్లు లాక్కెళ్లారని ఈడీ ఆరోపించింది.
దీంతో ఈ అంశంపై ఇటీవల కలకత్తా హైకోర్టులో విచారణ జరుగుతుండగా గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో దాడుల కేసు సుప్రీంకోర్టుకి చేరింది. సీఎం మమత తీరుపై ఈడీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. తమ అధికారుల ఫోన్లు, కీలక డాక్యుమెంట్లను మమతతో పాటు, బెంగాల్ పోలీసులు లాక్కున్నారని తుషార్ మెహతా కోర్టులో వెల్లడించారు. ఫుటేజీని పోలీసులు ధ్వంసం చేశారని.. కలకత్తా హైకోర్టులో వాదనలు వినిపించకుండా తమ లాయర్ను అడ్డుకున్నారని పేర్కొన్నారు. బస్సులు ఏర్పాటు చేసి హైకోర్టుకు జనాలను తరలించారని వివరించారు.
ఐప్యాక్ కార్యాలయంలో బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని నిర్ధరణకు వచ్చేందుకు ఆధారాలు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. సోదాల అడ్డగింత వ్యవహారంలో ఈడీ పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు.. పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, ఇతర వ్యక్తులు కోర్టులోకి ప్రవేశించారని పేర్కొన్నారు. దీంతో కేసు వాయిదా పడిందని.. ప్రజాస్వామ్యం స్థానంలో మూకస్వామ్యం వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని ఆరోపించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-municipal-elections-reservations-confirm/
తుషార్ మెహతా వాదనలు విన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలీలతో కూడిన ధర్మాసనం.. ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు వద్ద చోటుచేసుకున్న గందరగోళంపై కలత చెందామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని… దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కేసు మొత్తాన్ని పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సీఎం మమతా బెనర్జీతో పాటు సీనియర్ పోలీస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. సీసీటీవీ ఫుటేజ్లను భద్రపరచాలని, ఈడీ అధికారులపై నమోదు చేసిన కేసులపై స్టే విధించాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

